తెలంగాణ

telangana

కొవిడ్‌ చికిత్సా విధానం.. పునరాలోచనలో భారత్‌!

By

Published : Oct 17, 2020, 1:55 PM IST

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాతి స్థానం భారత్​దే. కోలుకుంటున్న వారి సంఖ్యలో మాత్రం మన దేశమే ప్రథమ స్థానంలో ఉంది. అయితే.. వ్యాధి నివారణకు ఉపయోగిస్తున్న ఔషధాలు.. రోగిలో తక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఫలితంగా కొవిడ్​-19 చికిత్సకు వాడే రెమ్​డెసివిర్​పై పునరాలోచనలో పడింది భారత్.

India to reassess coronavirus treatment protocol as Remdesivir found ineffective
కొవిడ్‌ చికిత్సా విధానం.. పునరాలోచనలో భారత్‌!

కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్‌.. పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితుల విషయంలో పనిచేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ చికిత్సలో రెమ్‌డెసివిర్‌ వినియోగంపై భారత్‌ పునరాలోచనలో పడింది.

అందుకే నిషేధం!

దేశంలో కొవిడ్‌-19 బాధితులకు రెమ్‌డెసివిర్‌తో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, రిటోనావిర్‌(లోపినావిర్‌), ఇంటర్‌ఫెరాన్‌ అనే ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిలో హైడ్రాక్సీ ఔషధాన్ని కొవిడ్‌ ప్రారంభ దశలో, రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఆమోదించింది. దేశంలో కరోనా బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన ఔషధం రెమ్‌డెసివిర్‌ కావడం గమనార్హం.

అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్‌ 15న నిర్వహించిన ట్రయల్స్‌లో భారత్‌ తరఫున 937మంది పాల్గొన్నారు. దీనిలో పై నాలుగింటిలో రెమ్‌డెసివిర్‌తో సహా.. ఏ ఔషధం మరణాల రేటును తగ్గించినట్టు కచ్చితంగా వెల్లడి కాలేదని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఇక ఇంటర్‌ఫెరాన్‌, కరోనా రోగులకు హానికరమని తెలిసిందని.. ఫలితంగా కరోనా చికిత్సలో దీని వాడకాన్ని నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

పున:సమీక్ష వైపు.?

ఈ ట్రయల్స్‌ వల్ల కరోనా చికిత్సకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం లభించిందని భారత్‌లో ఈ అధ్యయనాన్ని పర్యవేక్షించిన నిపుణులు తెలిపారు. దేశంలో రికవరీ రేటుకు సంబంధించిన గణాంకాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా చికిత్స విధానంపై పునఃసమీక్ష నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ అంశాన్ని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవల నేతృత్వంలో జరిగే కార్యాచరణ(టాస్క్‌ ఫోర్స్‌) సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చదవండి:మందులేనా? మంచి తిండీ ముఖ్యమే!

ABOUT THE AUTHOR

...view details