దేశంలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కొత్త కేసులు కలవరపరుస్తున్నా.. అదే స్థాయిలో కొవిడ్ బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుతుండడం ఊరటనిస్తోంది. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక మంది కోలుకున్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో ఉంది. భారత్లో శనివారం ఉదయం నాటికి 42 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నారు. ఒక్క శుక్రవారమే 95 వేలకు పైగా డిశ్చార్జి అయ్యారు. రికవరీల్లో భారత్.. అమెరికాను దాటేసిందని శనివారం కేంద్ర ఆరోగ్యం శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.61శాతంగా ఉంది.
సరైన సమయంలో పటిష్ఠ చర్యలు తీసుకోవడం వల్లే కొవిడ్ బారి నుంచి బాధితులు త్వరగా కోలుకుంటున్నారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. భారీ ఎత్తున నిర్ధారణ పరీక్షలు చేయడం, వారికి సరైన సమయంలో ప్రామాణికమైన చికిత్స అందజేయడం వంటి చర్యలు బాధితుల్ని మహమ్మారి నుంచి బయటపడేయడానికి దోహదం చేస్తున్నాయని వివరించింది.