తెలంగాణ

telangana

రెండు వారాల్లో.. 1.55 లక్షల కరోనా కేసులు

By

Published : Jun 16, 2020, 6:59 AM IST

కరోనాను నియంత్రించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలు చేసింది. అయితే జూన్ 8తో అనేక నిబంధనలను సడలించారు. ఈ నేపథ్యంలో రెండువారాల్లోనే 1.55 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. జూన్ ప్రారంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్.. గత రెండు వారాల్లోనే నాలుగు స్థానాలకు ఎగబాకిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే లాక్​డౌన్ ఎత్తేయడం వల్లే కేసులు గణనీయంగా పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

corona cases
రెండు వారాల్లో.. 1.55 లక్షల కరోనా కేసులు

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని వల్ల కరోనా కేసులను పెరగకుండా చూడవచ్చని భావించింది. నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తూ జూన్‌ మొదటి వారం నాటికి అనేక మినహాయింపులు ఇస్తూ వచ్చింది. జూన్‌ 8వ తేదీతో చాలా నిబంధనలను సడలించేశారు. ఫలితం రెండు వారాల్లో కొత్తగా 1.55లక్షల కేసులు నమోదయ్యాయి. జూన్‌ నెల ప్రారంభమయ్యే సమయానికి దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.76లక్షలుగా ఉంది. అయితే, జూన్‌ 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.32లక్షలకు చేరింది. అంటే కేవలం 15రోజుల్లో 1,55,772 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన టాప్‌-10 దేశాల జాబితాలో భారత్‌ వచ్చి చేరింది.

ప్రధాన నగరాల్లో పెరుగుతున్న కేసులు

జూన్‌ ముందు వరకూ వరకూ వివిధ రాష్ట్రాలు, నగరాల్లో కరోనా కేసుల నమోదు తీవ్రత తక్కువగా ఉండేది. అయితే, జూన్‌ మొదటి వారం నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఒక్క జూన్‌లోనే మహారాష్ట్రలో 42వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య లక్షను దాటేసింది. ఇక తమిళనాడులోనూ కేసుల సంఖ్య రెట్టింపు అయింది. మే 31వ తేదీ నాటికి 21,184 కేసులు నమోదు కాగా, పక్షం రోజుల్లో ఆ సంఖ్య 44,661కి చేరింది. అంటే దాదాపు 110శాతం పెరుగుదల ఉంది. ఇక దేశ రాజధాని పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కేవలం రెండు వారాల్లో 22,633 కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క జూన్‌ నెలలోనే కొత్తగా 88వేల కేసులు నమోదు కావడం గమనార్హం.

ఎనిమిదో స్థానం నుంచి..

మే 31వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ 8వ స్థానంలో ఉంది. కేవలం 15రోజుల్లో నాలుగో స్థానానికి చేరిందంటే దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. మే చివరి నాటికి భారత్‌తో పోలిస్తే, రెండింతల కేసులతో రష్యా సతమతమైంది. కానీ, ఈ పదిహేను రోజుల్లో అక్కడ కేవలం 52వేల కొత్త కరోనా కేసులు నమోదవడం గమనార్హం. అదే సమయంలో యూకేలో 22వేలు మాత్రమే నమోదయ్యాయి.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే జూన్‌ చివరి నాటికి భారత్‌ మూడో స్థానానికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య భారత్‌లో 9వేలు దాటింది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా 9,520మంది చనిపోగా, ఇందులో గత పదిహేను రోజుల్లో 4,356మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోనే 3,950మందిని కరోనా మింగేసింది.

కోలుకుంటున్నారు!

కరోనా బారిన పడివారు కోలుకుంటున్న తీరు భారత్‌లో మెరుగ్గా ఉండటం ఉపశమనం కలిగించే విషయం. మే 31 నాటికి రికవరీ రేటు 50శాతం ఉండగా, 86,980మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ 51శాతంగా ఉంది. దాదాపు 1.7లక్షలమంది కరోనా బారినపడి కోలుకున్నట్లు ఆరోగ్యసేతు యాప్‌ గణాంకాలు చెబుతున్నాయి.

జూన్‌లోనే కేసుల సంఖ్య పెరుగుదల ఎందుకు?

మే 31 వరకూ తక్కువ స్థాయిలో నమోదైన కేసులు ఆ తర్వాత పుట్ట పగలినట్లు ఒక్కసారిగా పెరగడానికి కారణం లాక్‌డౌన్‌ ఎత్తివేయడమేనని ఐసీఎంఆర్‌ పరిశోధన బృందం చెబుతోంది. లాక్‌డౌన్‌ షీల్డ్‌ వల్లే కేసుల పెరుగుదల తక్కువగా ఉందని ఆ బృందం వెల్లడించింది. కరోనా మహమ్మారి తీవ్రతను 34 రోజుల నుంచి 76 రోజులకు తగ్గించిందని తెలిపింది. ఐసోలేషన్‌ బెడ్‌లు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చని వెల్లడించింది. ఇప్పటికే జూన్‌ 15రోజులు ముగిసింది. మరో పక్షం రోజుల్లో కేసుల తగ్గుదలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇలాంటి సమయంలో ప్రజలు సంయమనంతో ఉండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్టకు తమవంతు కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:మాస్కు లేకుండా పెళ్లి వేడుకకు హాజరైన ఆరోగ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details