తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బలగాల ఉపసంహరణకు భారత్​-చైనా ఓకే

లద్దాఖ్​లో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్​-చైనా మధ్య నవంబర్​ 6న చుషుల్​లో జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది.

By

Published : Nov 11, 2020, 2:04 PM IST

Updated : Nov 11, 2020, 2:24 PM IST

Ladakh
లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణకు భారత్​-చైనా ఓకే

తూర్పు లద్దాఖ్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా.. వివిధ మార్గాల్లో, స్థాయిల్లో ఇప్పటివరకు చర్చలు జరిపాయి. అయితే తాజాగా నవంబర్​ 6న చుషుల్​లో జరిగిన 8వ కార్ప్​ కమాండర్​ స్థాయి చర్చల్లో ఇరుదేశాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇరు దేశాలు మోహరించిన బలగాలను ఉపసంహరించుకునేలా చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఉపసంహరణ ప్రక్రియ త్వరలో పూర్తికావచ్చని సమాచారం.

తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరుపక్షాల బలగాలను ఉపసంహరించి ఏప్రిల్‌-మే నాడు అవి ఎక్కడ ఉన్నాయో అక్కడకు చేర్చుతాయి. వారం రోజుల్లోపు మూడు దశల్లో దీన్ని అమలు చేయాల్సి ఉంది.

  1. పాంగాంగ్‌ సరస్సు వద్ద చర్చలు జరిపిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ట్యాంకులతో సహా సాయుధ వాహనాలను వాస్తవాధీన రేఖకు బాగా దూరంగా తరలించాలి.
  2. రెండో దశలో భాగంగా సరస్సు ఉత్తర భాగంలో సైనికుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తారు. రోజుకు 30శాతం బలగాలను మూడు రోజుల పాటు వెనక్కి పంపిస్తారు. భారత్‌ వైపు దళాలు ధ్యాన్‌చంద్‌ థాపా పోస్టు వద్ద ఉంటే చైనా బలగాలు ఫింగర్‌ 8 వద్ద ఉంటాయి.
  3. ఇక మూడో దశలో చుషుల్‌, రజాంగ్‌లా వద్ద ఇరు పక్షాలు ఆక్రమించిన శిఖరాలు, ప్రాంతాలను ఖాళీ చేసి వెనక్కి వెళ్లాల్సి ఉంది.

ఈ ఒప్పంద అమలును పరిశీలించేందకు ఇరు దళాలతో కూడిన సంయుక్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు డ్రోన్లను వినియోగించి ఒప్పందం అమలును పరిశీలిస్తారు.

తూర్పు లద్దాఖ్​లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్​-చైనా బలగాలను మోహరించాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు వివిధ మార్గాల్లో చర్చలు జరిపాయి. అయితే ఇప్పటివరకు చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాజాగా చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.

Last Updated : Nov 11, 2020, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details