రక్షణ రంగం... దేశ భద్రతకు ఎంతో కీలకం. అందుకే ఏటా బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించేది ఆ రంగానికే. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక పద్దులోనూ అన్నింటికంటే ఎక్కువగా రూ. 3.23 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది ఎక్కువే. కానీ... అసలు మెలిక ఇక్కడే ఉంది. కొన్నేళ్లుగా రక్షణ రంగానికి కేటాయింపులు నామమాత్రంగా పెరుగుతున్నాయి. అంకెలపరంగా బాగానే ఉన్నా... జీడీపీలో వాటాపరంగా చూస్తే మాత్రం కేటాయింపులు తగ్గుతున్నాయి. త్రివిధ దళాల ఖర్చులూ పెరుగుతున్నాయి. ఫలితంగా అరకొర నిధులతో రక్షణ వ్యవస్థ ఆధునికీకరణ చెప్పుకోదగ్గ స్థాయిలో సాగడంలేదు.
"దేశ భద్రతే తొలి ప్రాధాన్యం" అని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కానీ... ఆ ప్రకటనకు తగిన స్థాయిలో కేటాయింపులు మాత్రం చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి... ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. మొదటిది... మాంద్యం, పేదరికం వంటి సవాళ్ల మధ్య నిధుల పెంపు నిజంగా అవసరమా? రెండోది... ఉన్న నిధులతోనే రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయడం ఎలా?
ఆయుధాలా? ఆకలి తీర్చడమా?
రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించే దేశాల జాబితాలో ఇప్పటికే భారత్ది నాలుగో స్థానం. ప్రజల జీవితంతో నేరుగా ముడిపడిన విద్య, ఆరోగ్యానికి కేటాయింపులు మాత్రం అంతంతే. ఆ రెండు కీలక రంగాలకు కలిపి భారత్ వెచ్చిస్తోంది జీడీపీలో ఒక శాతం కంటే తక్కువే. ఆర్థిక మందగమనం సంగతి సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో.. రక్షణ రంగంపై ఖర్చు పెంచడం తగునా? ఒక్కొక్కటి రూ.1600 కోట్లకుపైగా విలువచేసే రఫేల్ జెట్లను మరిన్ని కొనుగోలు చేయడం అవసరమా?
నెలకు రూ. 4200తో గడుపుతూ.. 5 కోట్లకుపైగా మంది తీవ్ర పేదరికంలో మగ్గుతున్న దేశం మనది. 2019 డిసెంబర్ మింట్ నివేదిక ప్రకారం.. గత ఆరేళ్లలో 3 కోట్ల మంది దారిద్ర్యరేఖ దిగువకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదరిక నిర్మూలన కంటే ఆయుధాల కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలా..?
మరి దేశ భద్రత సంగతేంటి?
భద్రతాపరంగా ఉన్న ముప్పుల్ని ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ సమాజంలో మన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రక్షణ బడ్జెట్ ఎంతో కీలకం. దక్షిణాసియా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అస్థిర ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. భారత్కు పశ్చిమాన శత్రుదేశం, ఉత్తరాన గొప్ప శక్తిగా ఎదుగుతున్న చైనా ఉండనే ఉంది. ఆ రెండు దేశాల నుంచి ఉన్న ముప్పు భవిష్యత్లోనూ కొనసాగుతుంది.
చైనాతోనే సవాల్...
వచ్చే దశాబ్దంలో పాకిస్థాన్ను సైనికపరంగా నిలువరించడం సులువే కావచ్చు... అయితే చైనానే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. చైనా రక్షణ రంగం బడ్జెట్.. 250 బిలియన్ డాలర్లకుపైనే. ఇది భారత్ కంటే నాలుగు రెట్లు అధికం. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. 2030 కల్లా భారత్, చైనాలు సైన్యం కోసం వరుసగా 213, 736 బిలియన్ డాలర్లు కేటాయిస్తాయని.. ఐరోపా కమిషన్ అంచనా వేసింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు 500 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.
చైనా ఈ స్థాయిలో రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేస్తోందంటే... భవిష్యత్ పరిణామాలు అంతే తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే ఇందుకు కొన్ని ఉదాహరణలు చూశాం. అమెరికా, చైనా ఇప్పటికే వాణిజ్య, సాంకేతిక యుద్ధాలకు తెరలేపాయి. ఇది ప్రపంచాన్నే ప్రభావితం చేయొచ్చు. భారత్ కూడా ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలకు పోటీనిస్తోంది. ప్రపంచంలో ఓ బలీయమైన శక్తిగా భారత్ అవతరించాలంటే ఇప్పుడే దూకుడు పెంచాల్సి ఉంది. ఎంతో కాలం సమస్యల్ని సున్నితంగా పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చు.
మరి ఎలా ముందుకు?