రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ దేశంలోనే మొదటిసారిగా ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. దిల్లీ - లఖ్నవూ మధ్య నడిచే తేజస్ ఎక్స్ప్రెస్లో పయనం ఆలస్యమైతే... ప్రయాణికులకు పరిహారం అందిస్తామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ తన మొదటి రైలు సర్వీసును (అక్టోబర్ 5న ప్రారంభం) ప్రారంభించక ముందే ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.
ఆఫర్ల మీద ఆఫర్లు
రైలు ఒక గంట ఆలస్యమైతే రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250 చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఐఆర్సీటీసీ ఈ పరిహారం మొత్తాన్ని ఎలా లెక్కిస్తుందో.. ఏ విధంగా అందిస్తుందో తెలియజేయలేదు.
ప్రయాణికులకు 25 లక్షల ఉచిత బీమాను అందించనున్నట్లు పేర్కొంది ఐఆర్సీటీసీ. రైళ్లో దొంగతనం, దోపిడీలు జరిగితే లక్ష రూపాయల బీమా కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్డు ట్రైనుల్లో మొదటిసారి ప్రయాణించేవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇలా చేయాలి
ప్రయాణికులు ఆన్లైన్లో అందించిన లింక్ ద్వారా బీమా సంస్థ క్లెయిమ్ ఫారమ్ను పూరించాల్సి ఉంటుంది. లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రైలు ఆలస్యంపై దావా వేయవచ్చు. రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా బీమా కంపెనీని ఆశ్రయించవచ్చు. అవసరమైన పత్రాలు పరిశీలించిన తరువాత రెండు, మూడు రోజుల్లో క్లెయిమ్ పరిష్కారమవుతుందని ఐఆర్సీటీసీ తెలిపింది.