కరోనా లాక్డౌన్తో విద్యా వ్యవస్థ కుదేలైంది. విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు చెప్పాలోనని అన్ని ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతుంటే.. కేరళ మాత్రం నూతన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేసింది. ఇందుకోసం అంతర్జాలాన్ని వేదికగా చేసుకుంది.
కేరళ అధికారిక ఛానెల్ కైట్-విక్టర్లో 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు మొదలయ్యాయి. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ప్రక్రియను ప్రారంభించారు. దీనితో 45 లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇలా పూర్తిస్థాయిలో ఆన్లైన్లో పాఠాలు చెప్పడం దేశంలో ఇదే తొలిసారి.
ఒక్కో తరగతికి ఒక్కో టైమ్ స్లాట్ ఉంటుందని, సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పవర్ కట్తో సతమతమయ్యే విద్యార్థుల కోసం.. కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేస్తారు. ఇవి యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాయి.
"వెబ్, బ్రాడ్కాస్ట్, ఆఫ్లైన్లోనూ తరగతులను నిర్వహిస్తోంది కైట్-విక్టర్. ప్రతి క్లాసు కోసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారు. వీరిలో ఒకరు 30 నిమిషాల పాటు క్లాస్ చెప్తారు. విద్యార్థులు ఆ క్లాస్ను చూస్తారు. రాత్రికి విద్యార్థులను టీచర్లు మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదిస్తారు. వారి ఫీడ్బ్యాక్ను తీసుకుంటారు. విద్యార్థుల సందేహాలను తీర్చే బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులదే."
--- అన్వర్ సదాత్, కైట్ వైస్ ఛైర్మన్.
ఈ ప్రాజెక్ట్పై గత కొంతకాలంగా పని చేస్తున్నట్టు కైట్(కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్) తెలిపింది.