ఇంటర్నెట్ ద్వారా 'ధ్వని, టెక్ట్స్, చిత్రాలు' వంటి డేటాను పంపించడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను ఉపయోగిస్తుంటారు. అదే సెల్ఫోన్ల ద్వారా అయితే కొంతవరకు వైర్లెస్ విధానాన్ని అనుసరిస్తుంటారు. కొన్ని రకాల కాంతి కిరణాలు, లేజర్ కిరణాల ద్వారా వైర్లెస్ పద్ధతిలో సమాచారం పంపిస్తుంటారు. దీన్నే వోర్టెక్స్ బీమ్ విధానమని వ్యవహరిస్తుంటారు. అయితే తీవ్రమైన గాలులు, ఇతర వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ పద్ధతిలో డేటాను పంపించడం సమస్యగా మారుతోంది. దీన్ని అధిగమించడంపై గువాహటి-ఐఐటీ పరిశోధనలు జరిపి విజయం సాధించింది.
పరిశోధన సాగిందిలా..
కాంతి కిరణాలను లంబకోణంలో పంపించడం ద్వారా డేటా సరఫరా సామర్థ్యం తగ్గకుండా చూడవచ్చని నిరూపించింది. ఇందుకోసం ఆర్థోగోనల్ స్పేసియల్ మోడ్స్ను వినియోగించాల్సి ఉంటుంది. దీన్నే జెర్నైక్ మోడ్స్ అని కూడా అంటారు. వీటి ద్వారా ప్రారంభం నుంచి ముగింపు వరకు సిగ్నల్ సామర్థ్యం ఒకేలా ఉంటుందని, అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ వసంత రంజన్ బారువా చెప్పారు. తీవ్రమైన గాలులు వచ్చిన సమయంలో ప్రయోగాత్మకంగా కిలోమీటరు దూరం మేర సమాచారం పంపించినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. సమాచారం అందుకొనే వ్యక్తికి లబ్ధి కలిగేలా దీన్ని రూపొందించినట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న అభ్యపురి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంతను కొన్వార్ చెప్పారు. సమాచారం కేవలం అందుకోవాల్సిన వారికే చేరుతుందని, అందువల్ల సురక్షితంగా ఉంటుందని వివరించారు. రానున్న రోజుల్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ విధానం కీలక పాత్ర పోషించనుందని పరిశోధకులు తెలిపారు.
ఇదీ చూడండి:రూ.499కే కరోనా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు..!