తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2020, 7:45 AM IST

Updated : Mar 2, 2020, 12:02 PM IST

ETV Bharat / bharat

భారత్​కే కరోనా వస్తే... పరిస్థితి ఏంటి?

చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్​.. ప్రపంచ దేశాలకూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే సమస్య తలెత్తగానే ఆ దేశ ప్రభుత్వ యంత్రాంగం వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకుంది. మరి భారత్​లో ఈ మహమ్మారి వ్యాపిస్తే పరిస్థితి ఏంటనేది పలువురి విశ్లేషకుల మదిలో తలెత్తుతోన్న ప్రశ్న. ఈ తరహా వైరస్​ను తట్టుకునే సామర్థ్యం, వైద్య సంరక్షణ సేవలు ఎంత వరకు ఉన్నాయనేది ఓ సారి చూద్దాం.

if bhart effect with corona vius.. how our country will face this problem?
భారత్​కే కరోనా వస్తే... పరిస్థితి ఏంటి?.

చైనాలో కరోనా వైరస్‌ విజృంభించగానే అక్కడి విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను హుటాహుటిన స్వదేశానికి తరలించారు. సమస్య తలెత్తగానే వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకున్న చైనాతో పోలిస్తే- భారత్‌లో ఈ మహమ్మారి వ్యాపిస్తే పరిస్థితి ఏమిటనేది పలువురి మదిలో తలెత్తుతున్న ప్రశ్న. దీన్ని తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు మనం ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాం! మన వైద్య సంరక్షణ సేవల సామర్థ్యం ఏమిటనే అంశాలను మనం ఓసారి సరిచూసుకోవాల్సి ఉంది. వైరస్‌ వ్యాప్తి వంటి ముప్పు వాటిల్లితే, చైనా మాదిరిగా ఉక్కు పిడికిలితో నియంత్రణ చర్యలను భారత్‌ చేపట్టగలదా అనేది సందేహాస్పదమే. ప్రస్తుతం చైనాలో ఆరోగ్య ఆత్యయిక పరిస్థితి నెలకొంది. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. అది అనుసరిస్తున్న నియంత్రణ పద్ధతుల్ని మానవ హక్కుల సంఘాలు విమర్శించినా- దూకుడుతో వైరస్‌ నియంత్రణకు రంగంలోకి దిగడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రశంసించింది. వుహాన్‌లో చైనా కేవలం పది రోజుల్లో 6,45,000 చదరపు అడుగుల అత్యవసర ఆస్పత్రిని నిర్మించింది. రెండస్తుల ఆస్పత్రిలో 30 ఐసీయూలు, వెయ్యి పడకలు, ప్రత్యేక నడవాలను ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో మరో ఆస్పత్రినీ సిద్ధం చేశారు.

2019 డిసెంబర్‌లో కరోనా వైరస్‌ను తొలిసారిగా గుర్తించారు. ఇది 2002-03లో 774 మంది ప్రాణాల్ని బలిగొన్న సార్స్‌ వైరస్‌ కుటుంబానికి చెందినదేనని తేల్చారు. కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో స్వల్పసంఖ్యలో కేసుల్ని నిర్ధరించగా, మరికొన్ని కేసుల్ని పరిశీలనలో ఉంచారు. వుహాన్‌ నుంచి తిరిగొచ్చిన వారిని దిల్లీ విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఉంచారు. కరోనా వైరస్‌కు ఎటువంటి టీకాగానీ, నిర్దిష్టంగా రుజువైన ఔషధంగానీ లేవు. బాధితులకు లక్షణాల తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. వైరల్‌ న్యుమోనియా వంటి తీవ్రస్థాయి కేసులకు అవసరమైతే వెంటిలేషన్‌ సౌకర్యం అందజేస్తూ, ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. మహా నగరాల్లో ఉండే ఆస్పత్రుల్లో మాత్రమే ఇలాంటి సదుపాయాలతో చికిత్స అందించే అవకాశం ఉంది. వైరస్‌ వ్యాప్తి తీవ్రత మరింతగా పెరిగితే చాలా రాష్ట్రాల్లోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన చికిత్స అందించే పరిస్థితులు కనిపించడం లేదు.

సంసిద్ధత అరకొరే...

దేశవ్యాప్తంగా సమగ్రమైన వ్యాధి నిఘా వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ పురోగతి స్థాయిలోనే ఉంది. దశాబ్దం క్రితం హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ముప్పు తీవ్రస్థాయిలో పెరగడంతో ఈ వ్యవస్థను విస్తరించినా, చాలాచోట్ల సమర్థమైన ప్రయోగశాలల ఏర్పాటు అవసరం ఉంది. వైరస్‌ సంబంధిత పరిజ్ఞానానికి చెందిన 150 రోగనిర్ధరణ, పరిశోధన ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని 2012లో ప్రతిపాదించారు. వీటిలో ప్రస్తుతం 80 మాత్రమే పని చేస్తున్నాయి. ప్రస్తుత అవసరాలకు ఇవెంతమాత్రం సరిపోవు. జిల్లాల్లో అమలవుతున్న సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థ కార్యక్రమాన్ని సూక్ష్మస్థాయిలో- లక్షణాలను గమనించే పద్ధతి దిశగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. రేబీస్‌, బ్రుసెలోసిస్‌, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ వంటి జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల పర్యవేక్షణకు అవసరమైన వ్యవస్థ మనదేశంలో పకడ్బందీగానే ఉన్నా- వన్యప్రాణులు, ఇతర జీవుల కారణంగా వ్యాప్తి చెందే సరికొత్త వైరస్‌లకు సంబంధించిన ముప్పు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. పలు రకాల వైరస్‌ల పుట్టుక, వ్యాప్తిని గుర్తించేందుకు ఒకే తరహా ఆరోగ్య విధానం అవసరం. వన్యప్రాణులు, పశుసంపద తదితర గణాంకాలు, క్లినికల్‌ అధ్యయనాలను ఇందులో భాగం చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో వ్యాధులు ప్రబలినప్పుడు జంతు సంబంధమైన రోగ కారకాలు మన దేశంలోకి ప్రవేశించే మార్గాలను గుర్తించే దిశగా అధ్యయనాలు చేపట్టడం ప్రస్తుతం అత్యవసరం. ఈ తరహా పరిస్థితుల్ని ఎదుర్కొనే విషయంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ), భారత వైద్య పరిశోధన మండలి తమ వంతు యత్నాల్ని ముమ్మరం చేశాయి. అత్యవసర స్థితిని ఎదుర్కోవడం, ప్రాధాన్య రంగాలపై అధ్యయనాల విషయంలో భారత్‌ ఇప్పటికీ వెనకంజలోనే ఉంది.

2018లో కేరళలో నిఫా వైరస్‌ వల్ల 17 మంది ప్రాణాలు పోయాయి. స్థానిక గబ్బిలాలపై అధ్యయనాల వివరాలు లేకపోవడంతో వైరస్‌ లక్షణాల్ని గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, కేరళ ఆ విషాద ఉదంతం నుంచి చాలా నేర్చుకుంది. అందువల్లే ఆ రాష్ట్రం కరోనా వైరస్‌ వ్యవహారాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. రెండు వేలకుపైగా పౌరులను వారి గృహాలకే పరిమితం చేసి, నిరంతర నిఘాలో ఉంచింది. ఏ ఒక్క కేసునూ వదిలిపెట్టబోమని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి స్పష్టీకరించడం వారి నిబద్ధతను సూచిస్తోంది. ఈ తరహా కట్టుదిట్టమైన చర్యలు ఇతర చోట్ల కనిపించడం లేదు. వైరస్‌ కారణంగా ముప్పున్న 30 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి, అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి, నియంత్రించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నుంచి నిర్దిష్ట రీతిలో మార్గదర్శకాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కరోనా వైరస్‌ 19 దేశాలకు వ్యాపించింది. ఇందులో భారత పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌ కూడా ఉన్నాయి. మనుషుల నుంచి మనుషులకు స్పర్శ ద్వారా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పట్టణాల్లో రద్దీగా ఉండే చోట్ల, అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే విషయంలో భారత్‌ తగినంత సంసిద్ధంగా లేదనే చెప్పాలి. నగరాల నిర్మాణాలు, ఆవాసాలు పెరిగిపోతుండటంతో- ఒకసారి వ్యాధులు ప్రబలితే అత్యంత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. నగరాల్లో అన్ని వైపులా వ్యాపించి ఉండే మురికివాడలు, మురుగు వ్యర్థాల శుద్ధి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం పరిస్థితుల్ని మరింత దుర్భరంగా మార్చే ముప్పూ ఉంది. ప్రజారోగ్య కార్యకలాపాల్ని అందరికీ చేర్చే విషయంలో ఆరోగ్యసంబంధ మౌలిక సదుపాయాల అండదండలు అవసరం. కానీ, దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాల పరిస్థితి ఏ మాత్రం ఆశావహంగా లేదని చెప్పవచ్చు. 2018 జాతీయ ఆరోగ్య ప్రొఫైల్‌ ప్రకారం దేశంలో 23,582 ప్రభుత్వ ఆస్పత్రులుండగా, వాటిలో 7,10,761 పడకలున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 19,810 ఆస్పత్రులు, 2,79,588 పడకలు, పట్టణ ప్రాంతాల్లో 3,772 ఆస్పత్రులు 4,31,173 పడకలున్నాయి. 2017 మార్చి 31నాటి గణాంకాల ప్రకారం- భారత జనాభాలో 70శాతానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నాయి. అక్కడ 1,56,231 ఉపకేంద్రాలు, 25,650 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5,624 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 2018 మార్చి నాటికి ప్రతి పది లక్షల జనాభాకు మొత్తం 2,903 రక్తనిధి కేంద్రాలున్నాయి. హెచ్‌1ఎన్‌1 భయాందోళనల తర్వాత మనవద్ద ప్రయోగశాలల వ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడినా, ప్రాథమిక ఆరోగ్య రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే చేయాల్సిందెంతో ఉంది. పట్టణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో తీవ్రస్థాయి కేసులు వస్తే ఆరోగ్య సేవలు కొంతమెరుగే కానీ, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పరిస్థితుల్ని మరింతగా మెరుగుపరచాల్సి ఉంది. నిఫా సందర్భంగా వేగంగా, తెలివిగా స్పందించడంలో కేరళ సాధించిన విజయం మిగతా రాష్ట్రాలు ఒక నమూనాలా తీసుకోవాల్సి ఉంది.

వివరాలిలా

చేయాల్సింది ఎంతో!

కొత్తగా గుర్తించిన కరోనా వైరస్‌ వేగంగా వ్యాపించే ముప్పును కలిగిఉన్నా... సమర్థమైన ప్రజారోగ్య సమాచార ప్రచారోద్యమంతో దాన్ని అడ్డుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య విభాగాలు ఏకతాటిపై నడవాలి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించకుండా, అవగాహనను పెంపొందించడంలో ప్రసార మాధ్యమాలు తమ వంతు తోడ్పాటు అందించాలి. భారత్‌ సహా చాలా దేశాలు భారీస్థాయిలో సంభవించే ఇన్‌ఫెక్షన్‌ సంబంధ వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా లేవు. ఈ విషయంలో ఆసియా దేశాలు గణనీయమైన ముప్పుల్ని ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య భద్రత సూచీ-2019 స్పష్టం చేస్తోంది. ఇందులో థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియాలు ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుండగా, 195 దేశాల సూచీలో భారత్‌ 57వ స్థానంలో ఉంది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ సేవల్లో ప్రైవేటు రంగం బలీయమైన శక్తిగా అవతరించింది. కరోనా వైరస్‌ వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రులు తమంతటతాము సంసిద్ధమవుతున్నాయి. అయితే, చిన్నపట్టణాలు, గ్రామాల్లో ఇలాంటి ఆస్పత్రుల ప్రభావం చాలా తక్కువే. అంతేకాకుండా, చాలాచోట్ల ప్రైవేటు చికిత్సను భరించగలిగే అవకాశం లేదని నిపుణుల అభిప్రాయం. మరోవైపు, చాలామందికి మాస్కులు ధరించడం వంటి రక్షణ పద్ధతులపైనా అవగాహన ఉండటం లేదు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ముప్పు అధికంగా ఉండే వారికి తగిన పరీక్షలు నిర్వహించడం మంచిది. వుహాన్‌ స్థాయిలో మనదేశంలోనూ వైరస్‌ ప్రబలితే ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రంగం, ప్రజల్లో నైతిక స్థైర్యం వంటి అంశాలపై ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ముఖ్యంగా దిల్లీ, ముంబయి వంటి చోట్ల ప్రతి ఒక్కరూ కనీసం మూడు అడుగుల దూరాన్ని పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది కానీ, అది అసాధ్యం. మొత్తం నగరవాసులను ఇళ్లలోనే దిగ్బంధనం చేయడమూ కష్టమే. ఈ నేపథ్యంలో చురుకైన వ్యాధి ప్రతిస్పందన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాల్ని బలోపేతం చేయాలి. టీకా అభివృద్ధి యత్నాల్ని కొనసాగించాలి. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను అడ్డుకునేందుకు ప్రజారోగ్య వ్యవస్థ మరింత తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరముంది. దేశంలోకి వచ్చే ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేసేందుకు ప్రవేశ మార్గాల్ని పకడ్బందీగా మార్చాలి.

-పీవీ రావు, (రచయిత- ఆర్థిక, సామాజిక విశ్లేషకులు)

Last Updated : Mar 2, 2020, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details