తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంగా నేడు యడ్డీ ప్రమాణం.. 'కర్'నాటకం ముగిసినట్టేనా? - BJP

కర్ణాటకలో భాజపా ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్​ వాజూభాయ్​ వాలాను రాజ్​భవన్​లో కలిశారు యడ్డీ. జులై 31లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్​ గడువు విధించారు.

'కర్'నాటకం: సీఎంగా సాయంత్రం యడ్డీ ప్రమాణం

By

Published : Jul 26, 2019, 11:23 AM IST

Updated : Jul 26, 2019, 2:10 PM IST

సాయంత్రమే యడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమం

కన్నడనాట భాజపా పాగా వేసేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యడ్యూరప్పకు సీఎంగా ప్రమాణం ఇది నాలుగోసారి.

భాజపా నేతలతో కలిసి యడ్యూరప్ప ఈ రోజు ఉదయం రాజ్​భవన్​ వెళ్లారు. తమకు సంఖ్యాబలం ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్​ వాజూభాయ్ వాలాను కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్​.. ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. అయితే.. జులై 31లోగా విధానసభలో బలం నిరూపించుకోవాలని గడువు విధించారు.

గవర్నర్​తో భేటీ అయిన అనంతరం.. మీడియాతో మాట్లాడారు యడ్యూరప్ప. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రమాణ కార్యక్రమానికి కుమారస్వామి, సిద్ధరామయ్యలను స్వయంగా ఆహ్వానించినట్లు తెలిపారు.

''ఇప్పుడే రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిశా. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని కోరా. ఆయన అంగీకరించారు. ఈ రోజు 6 నుంచి 6.15 గంటల మధ్య ప్రమాణం స్వీకారం చేస్తా.''

- బీఎస్​ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

బలపరీక్షలో 'కుమార' ఓటమి

కర్ణాటక విధానసభలో విశ్వాసం కోల్పోయింది కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్​-జేడీఎస్​ సర్కారు. ఈ నెల 23న జరిగిన బలపరీక్షలో మెజారిటీ కోల్పోయింది సంకీర్ణ ప్రభుత్వం. ఫలితంగా.. 14 నెలల కూటమి అధికారానికి తెరపడింది. అనంతరం.. గవర్నర్​ను కలిసి రాజీనామాను సమర్పించారు కుమారస్వామి. నూతన ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.

స్పీకర్​పైనే...?

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్​.. గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాలు సమర్పించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ కారణంగా విధానసభలో ఎమ్మెల్యేల సంఖ్య స్పీకర్​ను మినహాయిస్తే 224 నుంచి 220కి చేరింది.

ఫలితంగా... ప్రభుత్వ ఏర్పాటుకు 111 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం భాజపాకు స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్​తో కలిపి 106 మంది మద్దతు మాత్రమే ఉంది. రాజీనామాలు చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు.. కాషాయ పార్టీకి మద్దతిస్తారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి.. ప్రభుత్వం ఏర్పడినా నిలిచేందుకు స్పీకర్​ నిర్ణయం కీలకం కానుంది.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: మళ్లీ మొదటికి వచ్చిన సంక్షోభం

Last Updated : Jul 26, 2019, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details