రాష్ట్రంలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మధ్యప్రదేశ్ హోం మంత్రి, భాజపా నేత నరోత్తం మిశ్రా చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఏ కార్యక్రమంలోనూ తాను మాస్కు ధరించనని ఆయన వ్యాఖ్యానించారు. ఇందోర్లో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన సమయంలో.. మంత్రిని 'మీరెప్పుడూ మాస్కు ధరించట్లేదు.. కారణమేంటీ' అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ''నేను ఏ కార్యక్రమంలోనూ మాస్కు ధరించను. అయితే ఏంటీ?'' అని ఎదురుప్రశ్నించారు మంత్రి.
అదే కార్యక్రమానికి హాజరైన మిశ్రా కేబినెట్ సహచరులు తులసీరామ్ శీలావత్, ఇతర భాజపా నేతలు మాత్రం మాస్కులు ధరించారు.
హోం మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్.. కొవిడ్ నిబంధనలు సామాన్య ప్రజలకేనా, ప్రజాప్రతినిధులకు పట్టవా అని ప్రశ్నించింది.