కర్ణాటకలో రైలు ఆలస్యం కావడం వల్ల ఆదివారం జరిగిన నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) పరీక్షను వందలాది మంది అభ్యర్థులు రాయలేకపోయారు. గంట ఆలస్యంగా రైలు బెంగళూరుకు చేరిందని, ఈ కారణంగా తాము పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశపరీక్ష 'నీట్'కి ఈసారి దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కర్ణాటకలో మినహాయిస్తే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఫొని తుపాన్ కారణంగా ఒడిశాలో నీట్ పరీక్షను మానవ వనరుల మంత్రిత్వశాఖ వాయిదా వేసింది.
'16591-హంపీ ఎక్స్ప్రెస్' గంట ఆలస్యంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంది. ఫలితంగా విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు.
ఇది మోదీ వైఫల్యమే...
రైలు ఆలస్యమై కర్ణాటక విద్యార్థులు నీట్ పరీక్ష రాయలేకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది భాజపా, ప్రధాని మోదీ వైఫల్యమని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.