వైరస్ బారినపడకుండా నివారణ చర్యల్లో భాగంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కషాయాలకు, విటమిన్-సీ ఉండే వంటి ఆహార పదార్థాల కోసం గూగుల్లో అధికశాతం మంది శోధించారని ఆ సంస్థ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గూగుల్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. పానీపురి, ఔషధ కషాయాలను తయారు చేసుకోవడంలో 107 శాతం పెరుగుదల కనిపించింది. అయితే 5 నిమిషాల వంటకాల శోధనలో ఇది 56 శాతం వృద్ధి సాధించిందని గూగుల్ వెల్లడించింది.
దేశమంతా లాక్డౌన్లో అమల్లో ఉన్న కారణంగా దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్న ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా.. తెలియని వాటి గురించి గూగుల్లో వెతకడం ఈ మధ్య సర్వసాధారణమైంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కషాయం లాంటి పదార్థాలను ఎక్కువశాతం తీసుకోవడంపై ఆసక్తి కనబరస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిలుపు ఇవ్వడం వల్ల ఆయుర్వేద చిట్కాలను 90 శాతం మంది శోధించారని గూగుల్ ఇండియా వెల్లడించింది.
ఇంకా ఏమేం శోధించారంటే..
- 5 నిమిషాల్లో సిద్ధమయ్యే కషాయాల తయారీని శోధించే వారి సంఖ్య 20 శాతం పెరిగింది.
- విటమిన్-సీ పదార్థాల కోసం శోధించే వారి సంఖ్య 150 శాతానికి పెరిగింది. ఇక ఆయుర్వేద జూస్ 'గిలోయ్' లక్షణాలనూ వెతికే వారి సంఖ్య 380 శాతానికి చేరింది. ఇలాంటి ఔషధ గుణాలున్న కషాయాల కోసం 90 శాతం మంది వెతికారు.
- ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన వీక్షకుల సంఖ్య 180 శాతం పెరిగింది.
- ఈ ఏడాది మార్చి నుంచి గూగుల్లో 'నియర్ మీ'ని వెతకడం ఆసక్తికర విషయం. ఇందులో వైద్య ఆరోగ్య సంబంధమైనవి 58 శాతం కాగా.. కిరాణ సరకులు- 550 శాతం, రేషన్ దుకాణాల కోసం వెతికిన వారి సంఖ్య 300 శాతానికి పైగా పెరిగింది.