తెలంగాణ

telangana

'భారత్​-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'

By

Published : Dec 18, 2019, 8:10 PM IST

Updated : Dec 18, 2019, 8:38 PM IST

భారత్-చైనా మధ్య పరస్పర సహకారంతోనే ఏళ్లుగా నెలకొన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్లేషకుల భావిస్తున్నారు. ఇదే విషయమై ఈ నెల 21న రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులు సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సానుకూలతలు ఉన్నప్పటికీ.. కొన్ని అంశాలు సమస్యగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భేటీలో సరిహద్దు వివాదం కొలిక్కివస్తుందా? లేదా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

high level of dialogue that has been going on between India and China
భారత్​-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం

గత 16 ఏళ్లుగా భారత్- చైనాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల ద్వారా పెద్దగా ఫలితాలు రాకపోయినా.. ఇరుదేశాలు చర్చలు ద్వారా ఓ సానుకూల ఫలితం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యలపై చర్చించడానికి నియమించిన ప్రత్యేక ప్రతినిధుల సమావేశం డిసెంబర్ 21న జరగనుంది. ఈ 22వ సమావేశంలో భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనైనా సరిహద్దు సమస్యలకు పరిష్కారం కనుగొంటారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

వాజ్​పేయీ హయాంలో మొదలు

సరిహద్దు సమస్యను పరిష్కరించడం కష్టతరమనే విషయాన్ని భారత్, చైనాల మధ్య ఇదివరకు జరిగిన 21 సమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యున్నత స్థాయి ప్రతినిధులను నియమించి సరిహద్దు సమస్యలపై చర్చించుకోవాలని అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ, చైనా అధ్యక్షుడు హూ జింటావో 2003లో నిర్ణయించారు. ఏ రూపంలో సమస్యను పరిష్కరించాలనే విషయాన్ని అదే సమావేశంలో చర్చించారు.

2005లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని వెన్ జియాబావో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిమితులు, పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలను రూపొందించారు. దీని ద్వారా సమస్యను పరిష్కరించడానికి ఆ ప్రాంత ప్రధాన భౌగోళిక లక్షణాలు, జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. వీటితోపాటు వాస్తవాధీన రేఖను ఇరుదేశాల అంగీకారంతోనే నిర్ణయించుకోవాలని అనధికారంగా తీర్మానించారు. ఆ తర్వాత చైనా ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది. సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలు, వాస్తవాధీన రేఖను నిర్ణయించకపోవడం వంటి కారణాలతో దీనిపై వెనకడుగువేసింది.

అక్సాయిచిన్, అరుణాచల్ ప్రదేశ్​ వివాదాలు

1962లో జరిగిన యుద్ధంలో చైనా భారత భూభాగంలోకి బలవంతంగా చొచ్చుకొచ్చింది. భారత అధీనంలో ఉండే అక్సాయిచిన్​లోని​ 34 వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని ఆక్రమించింది. భారత్​కు తూర్పున ఉండే అరుణాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాన్ని సైతం చైనా తనదిగా చెప్పుకుంటోంది. ఆ ప్రాంతాన్ని లోయర్ టిబెట్​గా చైనా పరిగణిస్తోంది. బ్రిటీష్ హయాంలో ఆయా ప్రాంతాల్లోని స్థానిక పాలకులు చేసుకున్న ఒప్పందాలను చైనా లెక్కచేయడంలేదు.

వెనకడుగేయని భారత్

14 దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న చైనా.. దాదాపు అన్ని దేశాలన్నింటితో వివాదాలను పెట్టుకుంది. అప్పటి సోవియట్ యూనియన్, వియత్నాంలతో యుద్ధాలు కూడా చేసింది. తనకున్న ఆయుధ సంపత్తి, ఆర్థిక శక్తులతో భూటాన్, భారత్​లను మినహాయించి అన్ని దేశాల సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోగలిగింది. ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందాలన్నీ చైనాకు అనుకూలంగా చేసుకుంది. ఎప్పుడూ చైనాకు వంతపాడే పాకిస్థాన్ అయితే ఏకంగా పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని భూభాగాన్ని ఆ దేశం చేతిలో పెట్టింది. భారత్​తో పోలిస్తే ఐదు రెట్ల పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా చైనాతో సరిహద్దు సమస్యలపై భారత్ వెనకడుగువేయలేదు. డోక్లాం ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు భూటాన్​కు మద్దతుగా భారత సైన్యం జోక్యం చేసుకోవడాన్ని చైనా అస్సలు సహించలేదు. యుద్ధం పేరుతో భారత్​ను భయపెట్టే ప్రయత్నం చేసింది. అయితే సైనిక బలాన్ని, ఆర్థిక శక్తిని చూపించి భారత్​ను అడ్డుకోవడం సాధ్యం కాదని చైనా ఇప్పుడు గ్రహించింది.

చైనా కాస్త నయమే..

భారత్, పాకిస్థాన్​ మధ్య అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వంటి సమస్యలు పరిష్కారమైనా... ఇప్పటికీ సరిహద్దుల్లో రోజూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు భారత్-చైనా వాస్తవాధీన రేఖ నిర్ణయించకపోయనా గత 57 ఏళ్లలో ఒక్క బుల్లెట్​ కూడా పేలలేదు. ఇరుదేశాలు ఈ సమస్యకు శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం కోరుకుంటున్నాయనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అయితే రెండు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలపై ఈ సరిహద్దు వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదు. సమస్యలు ఉన్నప్పటికీ భారత్-చైనా వర్తకం 80 బిలియన్​ డాలర్లకు చేరుకుంది.

సరిహద్దు వివాద పరిష్కారానికి జరుగుతున్న చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. జమ్ము కశ్మీర్ విషయంలో పాక్​కు అనుకూలంగా చైనా వ్యవహరించిన తీరును బట్టి తర్వాతి చర్చల్లోనూ భారత్​పై ఒత్తిడి పెంచడానికి ఆ దేశం సంసిద్ధంగా ఉంది. భారత్ కూడా చైనాను అడ్డుకోవడానికి సైనికపరంగా బలమైన దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపర్చుకుంటోంది.

స్పష్టమైన ఫలితం సాధ్యమేనా?

ప్రస్తుత పరిస్థితులను బట్టి భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదానికి సమీప భవిష్యత్తులో పరిష్కారం లభించే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయంతో ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా మార్గం సులభమవుతుంది. భారత్​ మాత్రం వాస్తవాధీన రేఖను చైనా తక్షణమే అంగీకరించాలని కోరుతోంది. అలా జరిగితేనే సరిహద్దులో ఇరుదేశాల మధ్య ఘర్షణ తలెత్తకుండా ఉంటుందని చెబుతోంది. డోక్లాం వంటి సంఘటన సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాలు రెండు దేశాల చర్చలపై దుష్ప్రభావాన్ని చూపించాయి. జమ్ము కశ్మీర్​ అంశంపై కొద్ది నెలలుగా ఏర్పడిన ఆందోళనకర పరిస్థితులు ఇరుదేశాల మధ్య చర్చలకు విఘాతం కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆగ్రాలో జరగనున్న డోభాల్, వాంగ్​ యీ భేటీలో స్పష్టమైన ఫలితం లభిస్తుందని ఆశించడం సబబు కాదు. అయితే సరిహద్దు వివాదం పరిష్కారంతోనే రెండుదేశాల సంబంధాలను అత్యున్నత శిఖరాలకు చేర్చవచ్చని భారత్​, చైనా అవగాహన చేసుకోవడం శుభపరిణామం.

భారత మార్కెట్లపై చైనా దృష్టి

కొద్ది నెలలుగా అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగించింది. చాలా వరకు అమెరికా కంపెనీలు తమ వ్యాపారాలను చైనా నుంచి తరలించాయి. ఫలితంగా చైనా కంపెనీల దృష్టి ఇప్పుడు భారత్​పై పడింది. వర్తకానికి, పెట్టుబడులకు భారత్​​ ఓ మంచి అవకాశమని అక్కడి వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. ఫలితంగా భారత్​తో ఉన్న వర్తక లోటును భర్తీ చేయడానికి చైనా పావులు కదుపుతోంది. ఆర్థిక సంబంధాలు మెరుగుపడితే సరిహద్దు వివాదం పరిష్కరించే విషయంలో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.
వాస్తవాధీన రేఖను నిర్ణయించే వరకు సరిహద్దులో వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ విభేదాలను పక్కనబెట్టడానికి ఇరుదేశాలు ఇప్పటివరకు ఓ విధానాన్ని పాటించాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించే విషయంలో రెండు దేశాలు అసాధారణ సహనాన్ని ప్రదర్శించాయి. ఇది సానుకూల ఫలితం కనబర్చింది. అయితే రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో సహకారాన్ని మెరుగుపర్చుకోవడం ద్వారానే సమస్యకు పరిష్కారం కనుకొనడం సాధ్యమవుతుంది.

(రచయిత-సురేశ్ బాఫ్నా)

Last Updated : Dec 18, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details