తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2019, 11:42 AM IST

ETV Bharat / bharat

'విద్యాలయాల్లో ఈ- సిగరెట్లను నిషేధించండి'

విద్యా సంస్థల్లో ఈ-సిగరెట్ల నిషేధాన్ని అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది ప్రభుత్వం. విద్యాలయాల ప్రాంగణాల్లో ఈ-సిగరెట్ల లభ్యతపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్  లేఖ రాశారు.

విద్యాలయాల్లో ఈ-సిగరెట్లను నిషేధించండి

ఈ సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో విద్యా సంస్థల్లోనూ వీటి లభ్యతపై అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందింగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. విద్యాలయాల పరిసరాల్లో ఈ-సిగరెట్లు లభ్యతపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

ఆర్డినెన్స్​ నిబంధనలను పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఈ-హుక్కా వంటి అన్ని రకాల పరికరాలను నిషేధించాలని రాష్ట్ర కార్యదర్శులకు రాసిన లేఖలో ఆదేశించారు.

"చూడటానికి అందంగా కనిపించే ఈ-సిగరెట్లు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రమాదకరమైన ఈ-సిగరెట్ల వంటి పరికరాలపై విద్యార్థులు, యువకులకు సరైన అవగాహన కల్పించాలి. ఈ-సిగరెట్ల పొగ ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది. ఇవి సొగసైన ఆకృతితో అందంగా కనిపిస్తాయి. వీటికి యువత ఆకర్షితులయ్యేలా మార్కెటింగ్ చేస్తున్నారు. వీటి వాడకం వల్ల సంప్రదాయ సిగరెట్ల వాడకం వైపు కూడా యువత మొగ్గుచూపుతారు."
-ప్రీతి సుడాన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి

ఈ-సిగరెట్ ఆర్డినెన్స్

2019 సెప్టెంబర్ 18న అమలు చేసిన ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ, ఎగుమతులు, దిగుమతులు, ఎలక్ట్రానిక్ సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిల్వ, ప్రకటనలు సహా ప్రత్యామ్నాయాలను తయారు చేయడం నేరంగా పరిగణిస్తారు. వీటిని అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఆర్డినెన్స్ ప్రకారం తొలిసారి నిబంధనలను అతిక్రమిస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత అతిక్రమణలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించనున్నారు. ఈ సిగరెట్లను నిల్వ ఉంచితే ఆరు నెలల జైలు శిక్ష, యాభై వేల జరిమానా వేస్తారు.

ఇదీ చూడండి: కర్తార్​పుర్ ప్రారంభోత్సవానికి అగ్రనేతలు హాజరు!

ABOUT THE AUTHOR

...view details