వాతావరణ మార్పులవల్ల దుష్పరిణామాలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంరక్షణకు ఉద్యమ స్థాయిలో నడుం బిగించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ సంక్షోభంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదపుటంచుల నుంచి పర్యావరణాన్ని గట్టెక్కించడానికి ఉద్దేశించిన కీలకమైన పారిస్ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా సమాయత్తమవుతున్న భారత్ తాజాగా 2020-21 బడ్జెట్లో పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాల కోసం రూ.4,400 కోట్లు కేటాయించింది. ప్రధానంగా కాలుష్యం బారినపడి ఉక్కిరిబిక్కిరవుతున్న నగరాల్లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, క్షీణించిపోతున్న వాయు నాణ్యతను కాపాడేందుకు ప్రాధాన్యమివ్వడం గమనార్హం. ఉత్తర భారతంతోపాటు దక్షిణాదిన ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచీలు అధ్వాన స్థాయికి చేరుకున్నాయంటే వాయు కాలుష్యం తీవ్రత స్పష్టమవుతోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు పొగమంచుకు తోడు పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారుతోంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని వాయు కాలుష్యాన్ని నివారించి, ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన గాలిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుని, సమగ్ర కార్యాచరణతో ముందుకు వచ్చే రాష్ట్రాలను ప్రోత్సహించి, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలన్న కేంద్రం ఉద్దేశం- పర్యావరణ పరిరక్షణ దిశగా కీలకమైన ముందడుగుగా భావించవచ్ఛు ఇందుకోసం స్వచ్ఛమైన, నాణ్యమైన వాయు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టడం శుభసూచకం. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ప్రమాణాలను రూపొందించే బాధ్యతను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు అప్పగించారు.
తాజాగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులకు కేటాయించిన బడ్జెట్లో రూ.460 కోట్లు కాలుష్య నియంత్రణ చర్యల కోసమే కేటాయించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద చేపట్టే కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. జాతీయ హరిత భారత మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఈ బడ్జెట్లో రూ.311 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకే రూ.246 కోట్లు కేటాయించారు. పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణల మూలంగా అంతరించిపోతున్న అడవులకు తోడు అటవీ ప్రాంతాల్లో రగులుకుంటున్న కార్చిచ్చు వల్ల ఏటా భారీస్థాయిలో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్చిచ్చుల నివారణ, నియంత్రణ కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లు కేటాయించారు.
తీవ్రమవుతున్న పరిస్థితులు..
భారత్లో శిలాజ ఇంధనాల వినియోగం మూలంగా వెలువడుతున్న కాలుష్యంతో ఏటా పది లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, పెచ్చరిల్లుతున్న కాలుష్యం ఫలితంగా ఏటా 9.80 లక్షల మంది శిశువులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారని ఇటీవల గ్రీన్పీస్ సంస్థ నిర్వహించిన ఆగ్నేయాసియా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలోకి ఇబ్బడి ముబ్బడిగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల మూలంగా ఉత్పన్నమవుతున్న వాయుకాలుష్యంతో భారీగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందంటే పరిస్థితులు ఎంతగా చేయిదాటిపోయాయో అర్థమవుతోంది. భారత్లో విస్తరిస్తున్న వాయు కాలుష్యం మూలంగా ఏటా వాటిల్లుతున్న నష్టం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.4శాతానికి సమానంగా ఉందన్నది అత్యంత కఠిన వాస్తవం. దేశీయంగా సంభవిస్తున్న ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం మూలంగా చోటు చేసుకుంటున్నదేనని తెలుస్తోంది. ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన విధానాలను పరిశీలించినట్లయితే వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోగా పెద్దగా ఆసక్తినీ ప్రదర్శించలేదని స్పష్టమవుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, రాజకీయ పక్షాలు... వృద్ధిరేటు, అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధలో ఇసుమంతైనా పర్యావరణం పైకి మళ్ళించకపోవడంతో పీల్చేగాలిలో స్వచ్ఛత, శుద్ధత ఉండని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ సంరక్షణలో భాగంగా వాతావరణ మార్పులు, భూతాపాన్ని అరికట్టేందుకు బడ్జెట్ కేటాయింపుల్లోనూ చిన్నచూపు చూస్తూ నామమాత్రంగా నిధులు విదిల్చి చేతులు దులిపేసుకోవడంతోనే ప్రస్తుతం ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి. ప్రస్తుతం భారత్లో వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనేందుకు- భీకర తుపానులు, వరదలు, కరవు, చలికాలంలో మండే ఎండలు, వేసవిలో కుండపోతగా వానలు, భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలే నిదర్శనం. ఈ పరిస్థితుల్లో సుస్థిరాభివృద్ధితో పాటు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలంటే ప్రాణికోటికి ముప్పు వాటిల్లజేస్తున్న కర్బన ఉద్గారాలను పూర్తిగా అదుపు చేయాలి.
ఇండియా వ్యూహాత్మక గమనం..