కేంద్రంపై మరోమారు విమర్శనాస్త్రాలను సంధించింది కాంగ్రెస్. సామాన్యులకు అండగా ఉంటామని చెబుతూనే వారి వెన్ను విరిచే విధానాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని హస్తం పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అభిప్రాయపడ్డారు. సామాన్యుడిపై భాజపా మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఇందుకు జీవిత, వాహన బీమా ప్రీమియంలను పెంచే ప్రతిపాదనలు, ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించే నిర్ణయాలు ఓ కారణమన్నారు.
ఉత్పాదకత, ఉపాధి, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, సామాజిక విభేదాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అహంకారం పెరిగిందని మండిపడ్డారు సింఘ్వీ.
దిగువ, మధ్య తరగతి వారిపై భారం
వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం 20 శాతం పెంచడం వల్ల ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ప్రభావం పడనుందని తెలిపారు సింఘ్వీ. అయితే ఈ నిర్ణయాలను ఆపే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. దీని వల్ల దిగువ, మధ్య తరగతి కుటుంబాలపై అధిక భారం పడుతోందన్నారు.