తెలంగాణ

telangana

దేశ ఐక్యతకు పాటుపడే వారికి అత్యున్నత పౌర పురస్కారం

By

Published : Sep 25, 2019, 4:41 PM IST

Updated : Oct 1, 2019, 11:46 PM IST

ఇకపై దేశ సమగ్రత కోసం పనిచేసే వ్యక్తులు, సంస్థలకు సర్దార్​ పటేల్​ జాతీయ ఐక్యతా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏటా అక్టోబర్​ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా అవార్డులకు ఎంపిక చేస్తారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందిస్తారు.

దేశ ఐక్యతకు పాటుపడే వారికి అత్యున్నత పౌర పురస్కారం

భారతదేశ ఐక్యత, సమగ్రతకు పాటుపడే వ్యక్తులు, సంస్థలను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత తొలి హోంమంత్రి సర్దార్​ వల్లభ్ భాయ్​ పటేల్​ పేరిట 'సర్దార్​ పటేల్​ జాతీయ ఐక్యతా పురస్కారం' ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్ర హోంశాఖ.

ఏడాదికి మూడు..

ఈ అవార్డులో పతకం, ప్రశంస పత్రం ఉంటుంది. అరుదైన, అత్యత అర్హమైన కేసులో మినహా మరణానంతరం ఈ పురస్కారం అందించటం కుదరదని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎలాంటి ఆర్థిక రివార్డు ఉండదు. ఒక ఏడాదిలో మూడు కన్నా ఎక్కువ పురస్కారాలు ఇవ్వకూడదని నిర్ణయించింది ప్రభుత్వం.

ఐక్యత దినోత్సవం రోజున ప్రకటన...

సర్దార్​ పటేల్​ జయంతి అయిన అక్టోబర్​ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. జాతీయ ఐక్యత, సమగ్రతను ప్రోత్సహించడానికి స్ఫూర్తిదాయకమైన సహకారం అందించి.. దృఢమైన భారత్​ నిర్మాణంలో పాలుపంచుకున్న వ్యక్తులు, సంస్థలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఏటా ఇచ్చే పద్మ పురస్కారాల కార్యక్రమంలో భాగంగానే ఈ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.

ఎంపిక కమిటీ...

అవార్డుల ఎంపికకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమిస్తారు. ఇందులో కెబినెట్​ కార్యదర్శి, పీఎం ప్రిన్సిపల్​ సెక్రెటరీ, రాష్ట్రపతి కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వారితో పాటు మరో ముగ్గురు లేదా నలుగురు ప్రముఖ వ్యక్తులను ఈ కమిటీలో సభ్యులుగా ప్రధాని నియమిస్తారు.

వ్యక్తిగతంగానూ..

భారత పౌరులు, సంస్థలు ఈ అవార్డుకు ఎంపికయ్యే అవకాశం కల్పించారు. వ్యక్తిగతంగా నామినేట్​ చేసుకోవచ్చు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన విభాగాలు, మంత్రులు కూడా పేర్లు సిఫార్సు చేయొచ్చు.

ఆన్​లైన్​ ద్వారానే...

ఏటా నామినేషన్లు స్వీకరిస్తారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్​సైట్​లో ఆన్​లైన్​ ద్వారానే దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ప్రాంతీయ, కుల,మత, లింగ భేదం, పుట్టిన ప్రాంతం, వయస్సు, వృత్తికి సంబంధం లేకుండా ఈ అవార్డుకు అందరినీ అర్హులుగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ.

ఇదీ చూడండి: మృత్యువు అంచుల వరకు వెళ్లి బతికాడు!

Last Updated : Oct 1, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details