తన సోదరుల్లా రాజకీయ నాయకుణ్ని కానని, అసలు రాజకీయాల్లోకి వస్తానో రానో చెప్పలేనని 2017 మార్చిలో ప్రకటించిన గోటబాయ రాజపక్స, పట్టుమని మూడేళ్లు తిరక్కుండానే శ్రీలంక అధ్యక్షుడిగా పట్టాభిషిక్తులయ్యారు. మొన్న 16వ తేదీనాటి ఎన్నికల్లో 52శాతం పైగా ఓట్లతో శ్రీలంక ఏడో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జయకేతనం ఎగరేసి అత్యున్నత పీఠం అధిష్ఠించిన మొట్టమొదటి మిలిటరీ మాజీ అధికారిగా చరిత్ర సృష్టించారు! కోటీ 60లక్షల మంది ఓటర్లుగల శ్రీలంకలో అత్యధికంగా 83.7 శాతం పోలింగ్ జరిగిన ఎన్నికలివి.
80 శాతం ఓట్లు...
ఏప్రిల్ నాటి వరస బాంబుదాడులతో దేశభద్రత ప్రమాదంలో పడిందన్న భావన మెజారిటీ వర్గమైన సింహళీయుల్లో ప్రబలగా, రాజపక్స కుటుంబీకుల చేతికి మళ్ళీ అధ్యక్ష పదవీ పగ్గాలు చిక్కితే అణచివేత తీవ్రతరమవుతుందన్న భయాందోళనలు తమిళ, ముస్లిం మైనారిటీల్లో పొటమరించాయి. కాబట్టే తమిళులు, ముస్లిములు మెజారిటీగా ఉన్న ఉత్తర తూర్పు పరగణాల్లో అధికార పక్ష అభ్యర్థి సజిత్ ప్రేమదాసకు 80 శాతందాకా ఓట్లు పోలయ్యాయి.
అధ్యక్ష పీఠం...
అయితేనేం, సింహళీయుల క్రియాశీల ఓటే నిర్ణాయకాంశమై గోటబాయకు అధ్యక్ష పీఠం కట్టబెట్టింది. 2005 నుంచి దశాబ్ద కాలంపాటు దేశాన్నేలిన మహింద రాజపక్స సోదరుడిగానే కాదు, ఎల్టీటీఈని సమూలంగా మట్టుపెట్టడంలో నాటి రక్షణ కార్యదర్శిగా కర్కశంగా వ్యవహరించిన గోటబాయను సింహళ సమాజం ఒక ‘హీరో’గా సమాదరిస్తోంది. ఈస్టర్ బాంబు దాడుల నేపథ్యంలో ప్రచ్ఛన్న ముష్కర మూకల పనిపట్టి దేశాన్ని సుభద్రంగా కాచుకోగల నాయకుణ్ని జనవాహిని గోటబాయలో చూసింది.
దేశభద్రతే కీలక అంశం...
సింహళీయుల ఓటే తనను గెలిపించినప్పటికీ శ్రీలంక పునర్నిర్మాణంలో తనతో కూడిరావలసిందిగా మైనారిటీ వర్గాలను గోటబాయ కోరుతున్నారు. దేశభద్రత, ఆర్థిక స్వస్థతలే ఎన్నికల్లో కీలక ప్రచారాంశాలు కాగా, ఆ రెండింటినీ గాడిన పెట్టడం కొత్త అధ్యక్షుడి పాలన దక్షతకు పెనుసవాలు కానుంది. చైనా వైపు రాజపక్స కుటుంబీకుల మొగ్గు ముంజేతి కంకణం కావడంతో శ్రీలంకతో స్నేహసేతువు నిర్మాణంలో ఇండియా జాగ్రత్తగా ముందడుగేయాలి!
రెండు ప్రధానాంశాలు...
కన్నీటి చుక్క ఆకృతిలో ఉండే ద్వీప దేశమైన శ్రీలంకకు సంక్షోభాల ఆటుపోట్లు ఎప్పుడూ ఉన్నవే. తమిళ పులుల ఉగ్రవాదంతో ఎగసిన అంతర్యుద్ధం దశాబ్దాల తరబడి దేశాన్నే కన్నీటి కాష్ఠంగా మార్చేసింది. మానవ హక్కుల్ని కాలరాసి, దాదాపు లక్షమందిని ఊచకోత కోసి, ఎల్టీటీఈని నామరూపాల్లేకుండా చేసి 2010లో మరోసారి అధ్యక్ష పీఠం అధివసించిన మహింద రాజపక్స- ప్రధానంగా చేసిన పనులు రెండు. దేశాధ్యక్షుడిగా తన స్థానాన్ని శాశ్వతం చేసుకొనే క్రమంలో రాజ్యాంగ సవరణలకు తెగించడం, బీజింగ్ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి హంబన్తోట లాంటి కీలక నౌకాస్థావరాల్ని చైనాకు అప్పగించడం! తనకు ఎదురే లేదనుకొంటూ 2015 నాటి ఎన్నికల బరిలోకి దిగిన మహిందకు తలబొప్పి కట్టించిన ప్రజాతీర్పు- మైత్రీపాల సిరిసేన నెత్తిన పాలుపోసింది.
సుప్రీం తీరు తగు పరిష్కారం...