తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా: కండా 'మద్దతు'తో కమలానికి చిక్కులు - భాజపాకు గోపాల్​ కండా మద్దతు

హరియాణా ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సంపాదించలేకపోయిన భాజపా... మద్దతు కూడగట్టే పనిలో పడింది. ఈ తరుణంలో కాషాయ దళానికి 'గోపాల్​ కండా' రూపంలో పెద్ద సమస్య ఎదురైంది. భాజపాకు మద్దతిస్తున్నట్టు ఈ లోక్​హిత్​ పార్టీ నేత ప్రకటించడం, ఇందుకు భాజపా సానుకూలంగా స్పందించడం వల్ల విపక్షాలతో సహా సొంత పార్టీ నుంచే కమల దళానికి వ్యతిరేకత పెరిగింది. అసలు ఎవరీ కండా?

హరియాణా: కండా 'మద్దతు'తో కమలానికి చిక్కులు

By

Published : Oct 25, 2019, 5:49 PM IST

గురువారం విడుదలైన హరియాణా ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి 6 సీట్ల దూరంలో నిలిచిపోయింది భాజపా. శుక్రవారం ఆ పరిస్థితి మారిపోయింది. మధ్యాహ్నానికల్లా కావాల్సిన మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది కమల దళం. స్వతంత్రులతో కలిపి తన బలాన్ని 40 సీట్ల నుంచి 48కి పెంచుకుంది. వీరితో పాటు లోక్​హిత్​ పార్టీ నేత గోపాల్​ కండా కూడా కాషాయ దళానికి తన మద్దతు ప్రకటించారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య.

గోపాల్​ ఓ వివాదాస్పద నేత. ఆయనపై ఓ కేసు కూడా ఉంది. ఆత్మహత్యకు పాల్పడేలా ఓ మహిళను ప్రేరేపించారన్నది ఈ లోక్​హిత్​ నేతపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఈ వివాదాస్పద నేత మద్దతు ప్రకటించడం, భాజపా దాన్ని అంగీకరించేందుకు సిద్ధమవడంపై విపక్షాలు మండిపడ్డాయి. గోపాల్​ కండా మద్దతును ఎలా స్వీకరిస్తారని ప్రశ్నలు సంధిస్తున్నాయి.

ఈ అంశంపై సొంత పార్టీ నుంచే భాజపాకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కండా మద్దతుపై భాజపా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు ఆ పార్టీ సీనియర్​ నేత ఉమా భారతి. 2012లో కాంగ్రెస్​ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కండాపై వచ్చిన ఆరోపణలను ఉమా భారతి గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ కీర్తి ప్రతిష్ఠలపై ఈ అంశం ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందని ఉమా భారతి హెచ్చరించారు.

భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. కండా... కాంగ్రెస్​ మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్​షా.. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పడు ఆయన మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.

ఏం జరిగింది?

2012లో అప్పటి కాంగ్రెస్​ ముఖ్యమంత్రి భూపిందర్​ సింగ్​ హుడా ప్రభుత్వంలో కండా హోం మంత్రి. తన విమానయాన సంస్థలో పని చేసిన ఓ ఎయిర్​హోస్టెస్​ను ఆత్మహత్యకు పాల్పడే విధంగా.. కండా ప్రేరేపించారని ఆరోపణలు వచ్చాయి. కండా వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆమె ఓ లేఖ రాసింది. ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం కండా.. బెయిల్​పై ఉన్నారు.

ఈ పూర్తి వ్యవహారంపై భాజపా(అప్పటి విపక్షం) నిరసనలు చేపట్టింది. కండాను అరెస్టు చేయాలని డిమాండ్​ చేసింది. ఒత్తిడికి తలొగ్గిన గోపాల్​ కండా.. తన పదవికి రాజీనామా చేశారు.

ఇదీ చూడండి:-కోటీశ్వరులతో నిండిన హరియాణా శాసనసభ!

ABOUT THE AUTHOR

...view details