తెలంగాణ

telangana

'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'

By

Published : Dec 2, 2019, 11:47 AM IST

Updated : Dec 2, 2019, 5:03 PM IST

హైదరాబాద్​ షాద్​నగర్​లో పశువైద్యురాలు దిశపై జరిగిన హత్యాచారం ఘటనపై రాజ్యసభలో గళమెత్తారు కాంగ్రెస్​ నాయకులు, వివిధ పార్టీల మహిళా నేతలు. ఇలాంటి వ్యక్తులను ప్రజల సమక్షంలో బహిరంగంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్​. కేవలం చట్టాలతో పరిస్థితి చక్కబడదని, ప్రజల్లో మార్పు రావడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

GN Azad, Congress in Rajya Sabha, on rape&murder of veterinary doctor:
'దిశ' అత్యాచారంపై రాజ్యసభలో విపక్షాల గళం

'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు రాజ్యసభ సభ్యులు. హైదరాబాద్​ షాద్​నగర్​లో పశువైద్యురాలిని బలిగొన్న నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యసభలో చర్చ సందర్భంగా కోరారు.

యావత్​ దేశం ఏకతాటిపైకి రావాలి

అత్యాచారం, హత్య ఘటనలు చట్టాలు చేయటం ద్వారా పరిష్కారం కావన్నారు రాజ్యసభలో కాంగ్రస్​ ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్​.

" నాకు తెలిసినంత వరకు మహిళలపై ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో జరగాలని ఏ ఒక్క ప్రభుత్వం, ఏ ఒక్క పార్టీ, నాయకుడు, అధికారి కోరుకోడు. వీటిపై మనం ఇప్పటికే చాలా చట్టాలు చేశాం. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను చూస్తే.. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన ఇవి ఆగవని అనిపిస్తోంది. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు యావత్​ దేశం, ప్రజలు ఒక్కటిగా నిలబడాల్సి ఉంది. ప్రతి ప్రాంతంలో అవగాహన కల్పించాలి. పార్లమెంటులో, విధానసభలో, పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో, ప్రైవేటు సంస్థల్లో ఇలాంటి వాతావరణం కల్పించాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి, కఠినంగా శిక్షించాల్సి ఉంది. "

- గులాం నబీ ఆజాద్​, రాజ్యసభలో ప్రతి​పక్ష నేత.

బహిరంగంగా శిక్షించాలి..

దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను బహిరంగంగా ప్రజల మధ్య శిక్షించాలని ఎస్​పీ ఎంపీ జయా బచ్చన్​ డిమాండ్​ చేశారు.

" ఇలాంటి హేయమైన అత్యాచార ఘటనలపై ఇక్కడ నిల్చొని ఎన్నిసార్లు మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. నిర్భయ కానీ, కథువా ఘటన కానీ, హైదరాబాద్ దుర్ఘటన కానీ.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏం జరిగింది? ప్రభుత్వాలు ఎలా స్పందించాయి? దోషులను ఏ విధంగా శిక్షించారన్నది ప్రజలు గమనిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే బహిరంగంగా దోషులను శిక్షిస్తారు. ఇది నా సూచన. కొంచెం కష్టమే. అయినప్పటికీ ఇలాంటి కిరాతకులను ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి వారి ద్వారానే శిక్షించాలి. "

- జయా బచ్చన్​, ఎంపీ.

సామాజిక సంస్కరణకు కలిసిరావాలి..

హత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు కాంగ్రెస్​ ఎంపీ అమీ యజ్నిక్​. దేశంలోని న్యాయ, శాసన, కార్యనిర్వాహక, ఇతర వ్యవస్థలన్నీ సామాజిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

ఆలస్యమైతే న్యాయం జరగనట్లే

హైదరాబాద్​ యువతి హత్యాచారంపై ఆందోళన వ్యక్తం చేశారు అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్​​. ప్రస్తుతం చిన్నారులు, మహిళలకు దేశం సురక్షితంగా లేదన్నారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితలను డిసెంబర్​ 31 లోపు ఉరితీయాలని డిమాండ్​ చేశారు. ఆలస్యమైతే న్యాయం జరగనట్లేనని పేర్కొన్నారు.

అత్యాచార దోషుల్ని జైలు నుంచి విడుదల చేసే ముందు నపుంసకుల్ని చేసేలా న్యాయస్థానాలకు అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డీఎంకే సభ్యుడు విల్సన్​.

న్యాయవ్యవస్థలో మార్పు దిశగా...

ఇలాంటి ఘటనల్లో కేవలం చట్టాలు చేస్తే సరిపోదన్నారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.

" మనందరం కలిసి సమాధానం ఇవ్వాలి. మరో మార్గం లేదు. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. శిక్షపడిన తర్వాత కూడా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అలాంటి ఘటన కూడా మనముందు ఉంది. అలాంటి వారు క్షమాభిక్షకు అర్హులా? న్యాయవ్యవస్థలో మార్పు దిశగా ఆలోచించాలి. దేశం నలుమూలల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీన్ని ఒక ప్రభుత్వ హయాంకు ఆపాదించకూడదు. ఇది సామాజిక బలహీనత, రుగ్మత. మన వ్యవస్థలో లోపం ఉంది. ఇంకో విషయం ఏమంటే.... నిందితుల వయసు. అకృత్యాలకు పాల్పడేవారి వయసుతో పనేముంది. ఈ విషయంలోనూ అంతా కలిసి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కొత్త బిల్లు అవసరం లేదు. రాజకీయ సంకల్పం, పరిపాలనా నైపుణ్యం కావాలి. ఆలోచనా ధోరణిలో మార్పు ద్వారా సామాజిక రుగ్మతలను చంపాలి."

- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్​.

ఇదీ చూడండి: 'ఆ రూ.40 వేల కోట్ల కోసమే భాజపా 'మహా' డ్రామా!'

Last Updated : Dec 2, 2019, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details