పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఖైదీలను తప్పించడం సినిమాల్లో చూసి ఉంటారు. ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరుగుతాయని ఎవరు ఊహించరు. అయితే రాజస్థాన్లో ఇలాంటి ఘటనే జరిగింది.
ఏకే-47తో కాల్పులు..
రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని బెహ్రోర్ పోలీస్ స్టేషన్లోకి చొరబడిన 10-15 మంది దుండగులు ఏకే-47తో కాల్పులు జరిపి.. ఐదు హత్యల కేసుల్లో కీలక నిందితున్ని స్టేషన్ నుంచి తప్పించారు.
మొత్తం 45 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎవరు గాయపడలేదని వెల్లడించారు. కాల్పుల అనంతరం రెండు వాహనాల్లో నిందితుడితో సహా దుండగులు పరారైనట్లు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. దాడి చేసిన దుండగులు, తప్పించుకున్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం ఉదయం గస్తీకాస్తున్న పోలీసులు.. ఎస్యూవీ వాహనంలో అటుగా వస్తున విక్రమ్ గుజ్జర్ (28) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు హత్య కేసుల్లో నిందితుడు విక్రమ్. అతడి నుంచి రూ.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో గుజ్జర్తో పాటు మరికొంత మంది ఉన్నప్పటికీ.. వారు తప్పించుకోగలిగారు. అనంతరం గుజ్జర్ను విడిపించేందుకు పోలీస్స్టేషన్పై దాడి జరిగినట్లు వెల్లడించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనే..
విక్రమ్ గుజ్జర్ రాజస్థాన్ సమీప రాష్ట్రమైన హరియాణాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్నాడు. అతడిపై రూ.లక్ష నజరానా కూడా ఉంది.
ఈ విధంగా గుజ్జర్ను దుండుగులు తప్పించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ కోర్టు ఆవరణలో ఇదే తరహాలో దాడి చేసి గుజ్జర్ను తప్పించినట్లు రికార్డుల్లో ఉంది.
ఇదీ చూడండి: ఒక రోగంతో ఆసుపత్రికి వస్తే మరో వ్యాధికి శస్త్రచికిత్స!