తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2019, 7:01 AM IST

Updated : Oct 2, 2019, 1:19 AM IST

ETV Bharat / bharat

గాంధీ 150: పాత్రికేయునిగా మహాత్ముడి జీవితం

రోజువారీ జీవితంలో వార్తాపత్రికలు ఎంతో ముఖ్యం. జాతీయోద్యమ సమయం నుంచే పత్రికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రజలను ఒక్కటి చేయడంలో పత్రికలు ఎంతో ఉపయోగపడతాయని గాంధీ నమ్మేవారు. పత్రికల ద్వారా ఆంగ్లేయులపై అక్షర ఆయుధాలు సంధించారు. ఇండియన్​ ఒపీనియన్​ ద్వారా తన గళాన్ని వినిపించారు. ఇండియన్‌ ఒపీనియన్‌ లేకుండా సత్యాగ్రహం అసాధ్యమని గాంధీజీ విశ్వసించేవారు.

గాంధీ 150: పాత్రికేయునిగా మహాత్ముడి జీవితం

భారత జాతీయోద్యమంలో పత్రికలు క్రియాశీలంగా వ్యవహరించాయి. ప్రారంభ దశ నుంచి.. భిన్న సంస్కృతులు, ప్రాంతాల ప్రజలను ఒక్కటి చేసి.. మహోద్యమంగా మారడంలో చురుకైన పాత్ర పోషించాయి. ఉద్యమ కార్యాచరణ ప్రజలకు చేరడానికి, వలసవాద ఆధిపత్య ధోరణిని వివరించడానికి.. చివరిగా జాతీయ భావజాలం ఏర్పడానికి స్వదేశీ పత్రికలు ప్రధాన సాధనమయ్యాయి. భయం, బెరుకు లేకుండా నాటి పాత్రికేయులు వెలువరించిన వార్తలతో శక్తి వంతమైన పత్రికలు వెలువడ్డాయి. నాటి ఉద్యమంలో ప్రధాన రాజకీయ నాయకుడు లేడు. ఎలాంటి పత్రికలు లేవు. నాయకులకు పత్రికల శైలి అంతగా తెలియని రోజులవి.

అలాంటి రోజుల్లో.. జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ పత్రికల ద్వారా ఆంగ్లేయులపై అక్షర ఆయుధాలు సంధించారు. ఓ పాత్రికేయునిగా, రచయితగా, వ్యాసకర్తగా గాంధీజీ ప్రయాణంలో 1903 నుంచి దక్షిణాఫ్రికాలో ప్రారంభమై 1945 వరకు సాగింది. నిబద్ధత గల పాత్రికేయునిగా, సంపాదకుడిగా బాపూజీ నిత్యం ప్రజా సమస్యలపై పత్రికల్లో రచనలు చేశారు.

నాటల్​ ఇండియన్​ కాంగ్రెస్​....

1903 నుంచి 1914 వరకు, తిరిగి 1919 నుంచి 1948లో తన తుదిశ్వాస వరకు.. గుజరాతీ, ఇంగ్లీష్‌, ఇతర భాషల్లో మహాత్ముడు వారపత్రికలను ప్రచురించారు. యంగ్‌ ఇండియా, నవజీవన్‌, హరిజన్‌, ఇండియన్‌ ఓపినీయన్‌ల ద్వారా గాంధీజీ చేసిన ప్రయత్నం... తనను ప్రత్యేకంగా నిలిపింది. 1893లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో దిగజారుతున్న భారత ప్రజల పరిస్థితులను, నాటి భారత ప్రభుత్వానికి తెలిపేందుకు.. 'నాటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌' - ఎన్ఐసీ స్థాపించారు. ఈ సమస్యల పరిష్కారానికి ఓ వేదికగా వారపత్రికను తేవాలనే ప్రయత్నం 1896 వరకు నెరవేరలేదు. బోయర్‌ యుద్ధానంతరం.. వార పత్రిక అత్యవసరమని గుర్తించారు. ఈ పరిస్థితుల్లో గాంధీజీ తన ముఖ్య రాజకీయ సహచరులతో ఇండియన్‌ ఒపీనియన్‌ పేరుతో వారపత్రికను ప్రారంభించాలని నిర్ణయించారు.

చివరకు 1903 జూన్‌లో డర్బన్‌ నుంచి ఇండియన్‌ ఒపీనియన్‌ వారపత్రిక మొదలైంది. అప్పుడు గాంధీజీ జోహన్నెస్‌బర్గ్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఓ పాత్రికేయునిగా బాపూజీ సుదీర్ఘకాలం, క్రియశీల పాత్ర పోషించారు. వర్ణ వివక్షతతో శ్వేతజాతీయుల పాలనలో భారతీయుల సమస్యలను చర్చించారు. ఓ పత్రిక లేకుండా సహోద్యోగులకు, ప్రజలకు సమస్యపై అవగాహన కల్పించడం అంత సులువు కాదని దక్షిణాఫ్రికా పరిస్థితులు గాంధీజీకి నేర్పాయి. ఇండియన్‌ ఒపీనియన్‌ని తన సహచరుల సహకారంతో.. ఇంగ్లీష్‌, హిందీ, గుజరాతీ, తమిళ భాషల్లో బాపూజీ తీసుకువచ్చారు. అంతా కలిసి వారపత్రికను సమగ్రంగా తీసుకు వచ్చేవారు. ఇండియన్‌ ఒపీనియన్‌కి భారతీయుల నుంచే కాకుండా నల్లజాతీయుల నుంచి మంచి ఆదరణ లభించింది. వర్ణవివక్ష పోరాటంలో.. సామాజిక, ఆర్థిక, రాజకీయ దుస్థితికి సంబంధించి ప్రశ్నలను శ్వేతజాతి ప్రభుత్వంపై సంధించింది. భారతీయ, దక్షిణాఫ్రికా నల్ల జాతీయులు ఎదుర్కోంటున్న సమస్యలపై లోతైన రచనలు చేసిన గాంధీజీ.. అవి విస్తృతంగా చర్చకు వచ్చేందుకు కృషి చేశారు.

పాత్రికేయుని మూడు లక్షణాలు..

గాంధీజీ దృష్టిలో పాత్రికేయం... ఓ గొప్ప వృత్తి. పాత్రికేయులు, పత్రికలకు మూడు కనీస లక్షణాలు ఉండాలి. ప్రజల దుస్థితిని గుర్తించాలి, అర్థం చేసుకుని, పరిష్కారం దిశగా సమర్థవంతంగా పనిచేయడం మొదటి లక్షణం. సమాజానికి అవసరమైన సామాజిక, రాజకీయపరమైన అవగాహన కల్పించి, ప్రజలను ప్రేరేపించడం రెండో లక్షణం. వలస రాజ్యాల లోపాలను బహిర్గతం చేసి.., అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల్ని సంఘటితం చేయడం... మూడో లక్షణం. నలభై ఏళ్ళకు పైగా పత్రికలను నడిపిన బాపూజీ ఈ మూడు లక్షణాలను ఏనాడూ విడవలేదు. ఈ 'గాంధేయ పాత్రికేయ నీతి' నిజమని నిర్థరించేందుకు.. ఆయన ఎప్పుడూ ప్రకటనలను పత్రికల్లో ప్రచురించలేదు. పాఠకుల చందాతోనే పత్రికను నడిపారు.

ఇండియన్‌ ఒపీనియన్‌ వారపత్రిక ప్రాముఖ్యత దాని పరిణామంలో లేదు. ఆ పత్రిక అందించిన వార్తల్లో ఉంది. 58 ఏళ్లపాటు సేవలు అందించిన ఇండియన్‌ ఒపీనియన్‌ చందాదారుల సగటు సంఖ్య 2 వేలు. ఓ సంతవత్సరంలో 3 వేల 500మంది ఉన్నారు. ఇండియన్‌ ఒపీనియన్‌.. నాటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ నుంచి వెలువడిన మొదటి భారతీయ పత్రిక కాదు. 1898లో ఇండియన్‌ వరల్డ్‌ అనే స్వల్పకాలిక వారపత్రిక ఉంది. 1901లో పీఎస్‌ అయ్యర్‌ తమిళం, ఇంగ్లీష్‌లో కలోనియల్‌ ఇండియన్‌ న్యూస్‌ని రెండేళ్లపాటు నడిపించారు. నాటల్‌లోని ఆఫ్రికన్లు కూడా కొన్నాళ్లు పత్రికలు ప్రచురించారు. ఇండియన్‌ ఒపీనియన్‌ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంపై పరిమితమైన స్వరాన్నే వినిపించింది.

1857 తిరుగుబాటు తర్వాత నాటి విక్టోరియా రాణి ఇచ్చిన వాగ్దానంపై గాంధీజీకి పూర్తి నమ్మకం ఉండేది. బ్రిటీష్‌ సామ్రాజ్యం స్వభావికంగా మంచిదేననే అభిప్రాయంతో అప్పుడు ఉన్నారు. భారతీయ సమాజానికి, దక్షిణాఫ్రికా నల్లజాతీయులకు రాజ్యాంగం ద్వారా న్యాయం జరుగుతుందని బాపూజీ నమ్మేవారు. వలసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే.. ఆ పత్రికను మూసివేయడం తప్ప మరో మార్గంలేని పరిస్థితుల్లో.. గాంధీజీ మధ్యేమార్గాన్ని అనుసరించారు. నాటి బ్రిటిష్‌ రాజ్యాంగానికి లోబడి ప్రాథమిక ఆందోళన, అన్యాయాలకు వ్యతిరేకంగా పత్రికను నడిపారు.

సాధారణ పౌరుడి నుంచి..

ఇండియన్‌ ఒపీనియన్‌ చారిత్రక ప్రాముఖ్యత ఏమిటంటే.. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష వలస పాలనలో భారతీయులు ఎదుర్కొన్న పరిస్థితులను రికార్డు చేసింది. నాటి భారీతీయుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. భారతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న నాటల్‌ మెర్క్యూరీకి వ్యతిరేకంగా... ప్రత్యామ్నాయ స్వరాన్ని అందించింది. సమస్యలను నివేదించే ఓ సాధారణ పౌరుడి నుంచి పోరాడే స్థాయికి గాంధీజీ చాలా త్వరగా చేరుకున్నారు. ఆయనతో పాటు.. ఇండియన్‌ ఒపీనియన్‌ శైలీ మారింది.

లియో టాల్‌స్టాయ్‌, జాన్‌ రస్కిన్‌ రచనల ప్రభావం గాంధీజీపై ఉంది. అందుకే.. 1904లో నగర జీవితాన్ని అసహ్యించుకున్న బాపూజీ.. డర్బన్‌కి 20 కిలోమీటర్ల దూరంలోని ఫినీక్స్‌ సెటిల్‌మెంట్‌లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. సరళమైన జీవితాన్ని గడపాలనుకున్నారు.

భారతీయుల హక్కుల కోసం గాంధీజీ.. మేధావులు, ప్రముఖల సహకారం తీసుకున్నారు. ఐక్య భారత సమాజం, జాతీయత గుర్తింపు అనే ఆలోచనలను ఇండియన్‌ ఒపీనియన్‌ వెన్నుదన్నుగా నిలిచింది. తమిళం, కోల్​కతా, ముస్లింలు, హిందువులు బ్రహ్మణులు.. అందరూ బ్రిటీష్‌ భారతీయులు అనే అభిప్రాయాన్ని ప్రోత్సహించింది. దక్షిణాఫ్రికాలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై గాంధీజీ నిరంతరం పోరాడారు. భారతీయ సమస్యలు, వివక్ష లేని న్యాయం కోసం ప్రతి సంచికలో.. రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాఖ్యలు, సంపాదకీయం ఉండటం.. ఇండియన్‌ ఒపీనియన్‌ లక్షణం.

భారతీయులు పనిచేస్తున్న కార్మాగారాల్లో పేలవమైన పరిస్థితులను ఇండియన్‌ ఒపీనియన్‌ ఎత్తిచూపింది. యజమానుల కఠిన వైఖరిని ఎండగట్టింది. పరిశ్రమల్లో పనిభారంతో పెరుగుతున్న ఆత్మహత్యలను నిశితంగా గమనించేది. అణచివేత, దోపిడికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో నాటి ఇండియన్‌ ఒపీనియన్‌ సంపాదకుడు, గాంధీజీ సన్నిహితుడు.. పోలాక్‌ భారతదేశాన్ని సందర్శించి మద్దతు సమీకరించారు.

ఇతర పత్రికలకు ధీటుగా..

అలా.. కాలంతో పాటు ఇండియన్‌ ఒపీనియన్‌ కనబరిచిన క్రియాశీల పాత్రికేయం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఈ శైలే 20వ శతాబ్దలోని అన్ని పత్రికల నుంచి ఇండియన్‌ ఒపీనియన్‌ని ప్రత్యేకంగా నిలిపింది. ఈ వారపత్రికకు పనిచేసిన సంపాదకుల్లో ఒకరు మినహా అంతా.. జైలు జీవితం గడిపినవారే. 1906 నుంచి 1913 మధ్య సత్యాగ్రాహ ప్రచారంలో ఈ సంప్రదాయం మొదలైంది. ఈ సమయానికి బ్రిటిష్‌ సామ్రాజ్యం స్వాభావికంగా న్యాయం అందిస్తుందన్న నమ్మకం గాంధీజీ కోల్పోయారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి సమస్య పరిష్కారం కోసం ఎదురుచూసే స్థితి నుంచి ప్రతిఘటన ఉద్యమ నాయకునిగా గాంధీజీ మారారు. 1906 వరకు రాజ్యాంగానికి లోపడి పనిచేసిన ఇండియన్‌ ఒపీనియన్‌.. ఆ తర్వాత ధిక్కార స్వరం వినిపించింది. చట్టాలను సవాలు చేసిన ఈ వార్తపత్రిక ప్రయత్నం... చారిత్రకంగా అత్యంత కీలక మలుపులకు నాంది పలికింది. 1906 సెప్టెంబర్‌ నుంచి భారతీయుల పోరాటాలు, ప్రతిఘటన, స్ఫూర్తివంతమైన కథలను ప్రచురించడం ద్వారా బ్రిటీష్‌ ప్రభుత్వానికి మింగుడుపడని స్థాయికి చేరింది. అన్యాయం, అవాస్తవాలపై పోరాడేందుకు త్యాగాలకు సిద్ధమై ముందుకు రావాలని ఇండియన్‌ ఒపీనియన్‌.. ప్రజల్ని బహిరంగంగా కోరింది. 1909లో 177 రోజులు గాంధీజీ గడిపిన జైలు జీవితంగా, ఇతర నాయకుల కారాగారాల గాథలను ప్రజలకు అందించి... అవగాహన కల్పించింది.

దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం ఉదయించిన ఇండియన్‌ ఒపీనియన్‌.. అక్కడి నల్ల జాతి ప్రజలకూ అండగా నిలిచింది. ఆఫ్రికన్‌ పోరాటాలకు మద్దతిచ్చింది. 1950 తర్వాత గాంధీజీ రెండో కుమారుడు మనీలాల్‌ గాంధీ నేతృత్వంలో సామాజిక, రాజకీయ పరిధిలో మరింత విస్తృతమైన కథనాలు అందించింది. భారతీయుల కంటే మానవ హక్కులపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అహింస, సత్యాగ్రహం మొదలైన మహాత్ముడి సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఓ మాధ్యమంగా మారింది. మనీలాల్‌ మరణించిన తర్వాత సుశీలా గాంధీ సంపాదకీయంలో ఈ ధోరణి మరింత ఎక్కువైంది. చివరకు 1961 ఆగష్టు 4న ఇండియన్ ఒపీనియన్‌ చివరి సంచిక వెలువడింది.

ఇండియన్‌ ఒపీనియన్‌ లేకుండా సత్యాగ్రహం అసాధ్యమని గాంధీజీ నమ్మేవారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఉద్భవించిన సత్యాగ్రహ ప్రాముఖ్యతను అంతా గుర్తించేటట్లు ఇండియన్‌ ఒపీనియన్‌ చేసింది. వలస, సామ్రాజ్య, వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు సత్యాగ్రాహం కీలక ఆయుధం కావడంలో.. ఇండియన్‌ ఒపీనియన్ పాత్ర మరవలేనిది. ఓ వార్తా పత్రికగా ఇండియన్‌ ఒపీనియన్‌, ఓ పాత్రికేయునిగా, సంపాదకుడిగా గాంధీజీ పోషించిన పాత్ర ఆదర్శంగా నిలిచిపోయాయి. ఆ విధంగా.. మానవజాతి చరిత్రలో మహాత్ముడు రాజనీతిజ్ఞునిగా, సామాజిక సంస్కర్తగా చెరగని ముద్ర వేయడమే కాకుండా.. నైతికత, నిబద్ధత, అంకితభావం గల పాత్రికేయునిగా తనదైన పాత్ర పోషించారు. పాత్రికేయ వృత్తిలో గాంధీజీ నెలకొల్పిన విలువలు.. వార్త ప్రచురణ, ప్రసార సంస్థలకు ఓ నమూనా.

Last Updated : Oct 2, 2019, 1:19 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details