జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఓమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై భాజపా నేత గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్ 370ని రక్షించుకుంటామని వారు చేసిన వ్యాఖ్యలను గంభీర్ ఖండించారు. ఇకపై దేశంలో ఇలాంటి రాజకీయాలు చేయలేరని హెచ్చరించారు. ప్రత్యేక హక్కులున్న రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాని ఉండాలన్న ఆశలు ఏనాటికీ నెరవేరవని స్పష్టం చేశారు.
ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న ఈ మాజీ క్రికెటర్... కేంద్ర మంత్రి జితేందర్ సింగ్కు మద్దతుగా ఉధమ్పుర్ జిల్లాలోని రామ్ నగర్, కథువాలోని నగ్రిలో ప్రచారం నిర్వహించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ ఒకే దేశమని ఉద్ఘాటించారు గంభీర్.