తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​-19పై సమర్థవంతంగా మరో ఔషధం!

కరోనా మహమ్మారిపై లోపినవిర్​, హైడ్రాక్సీక్లోరోక్విన్​ వంటి ఔషధాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా మరో ఔషధం ప్రస్తుతం వాడుతున్న వాటికంటే 20 రెట్లు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నట్లు ఐఐటీ దిల్లీ చేపట్టిన పరిశోధనలో తేలింది. ఎఫ్​డీఏ ఆమోదం పొందిన 'టెకోప్లానిన్'​ అనే ఈ ఔషధం.. కొవిడ్​పై సమర్థవంతంగా పని చేస్తుండటం ఆశలు రేకెత్తిస్తోంది.

By

Published : Sep 28, 2020, 4:39 PM IST

Teicoplanin
కొవిడ్​-19పై సమర్థవంతంగా మరో ఔషధం!

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికీ కచ్చితమైన చికిత్స లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఔషధం ప్రస్తుతం వాడుతున్న ఔషధాలకంటే పది నుంచి 20రెట్లు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నట్లు తేలింది. ఎఫ్‌డీఏ ఆమోదించిన 'టైకోప్లానిన్‌' ఔషధం కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుండడం ఆశలు కల్పిస్తోంది.

దిల్లీ ఐఐటీ ఆధ్వర్యంలో కుసుమ స్కూల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్స్‌ ఈ అంశంపై పరిశోధన చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా చికిత్సలో ఇప్పటికే వినియోగిస్తోన్న 23 ఔషధాలను పరీక్షించింది. వీటిలో లోపినవిర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కంటే టైకోప్లానిన్‌ 10-20రెట్ల సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఐఐటీ దిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ అశోక్‌ పటేల్‌ వెల్లడించారు. అశోక్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్‌ ప్రదీప్‌ శర్మ కూడా పాల్గొన్నారు.

తాజాగా ఈ పరిశోధన నివేదిక 'ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ మ్యాక్రోమాలిక్యూల్స్‌' ‌లో ప్రచురితమైంది.

" ఇప్పటివరకు టైకోప్లానిన్‌ యాంటీబయోటిక్‌ ఔషధాన్ని బాక్టిరియా ఇన్‌ఫెక్షన్‌ చికిత్సలో భాగంగా వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఉంది. రోమ్‌లోని సపైంజా యూనివర్సిటీ కూడా టైకోప్లానిన్‌ పనితీరుపై ప్రయోగాలు నిర్వహించింది. అయితే, స్వల్ప, తీవ్ర అనారోగ్యం ఉన్న రోగుల్లో ఇది ఏ విధంగా పనిచేస్తుందనే విషయం కోసం మరింత మందిపై ప్రయోగాలు అవసరం. "

- అశోక్​ పటేల్​, ప్రొఫెసర్ ఐఐటీ దిల్లీ​

ప్రపంచవ్యాప్తంగా కరోనాకేసుల సంఖ్య మూడుకోట్లు దాటగా ఇప్పటికే పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లోనూ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటింది. వీరిలో 95 వేల మంది మృతిచెందారు.

ఇదీ చూడండి: 2021 ఆరంభం నాటికి కరోనా వ్యాక్సిన్​!

ABOUT THE AUTHOR

...view details