తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2020, 6:29 PM IST

ETV Bharat / bharat

220 రోజుల తర్వాత ఫరూఖ్​ అబ్దుల్లాకు 'స్వేచ్ఛ'

ఏడు నెలల నిర్బంధం తర్వాత జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్​ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నిర్బంధించిన ఇతర నేతల్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంటు వేదికగా పోరాటం సాగిస్తానని స్పష్టంచేశారు.

Farooq Abdullah released from detention
220 రోజుల తర్వాత ఫరూఖ్​ అబ్దుల్లాకు 'స్వేచ్ఛ'

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్​ అబ్దుల్లా గృహ నిర్బంధానికి 7 నెలల తర్వాత తెరపడింది. ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో ప్రజా భద్రతా చట్టం కింద విధించిన గృహ నిర్బంధాన్ని ఎత్తివేసింది జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం.

ఇక దిల్లీకి వెళ్లి...

220 రోజుల తర్వాత శ్రీనగర్​లోని తన నివాసం నుంచి బయటకు వచ్చారు ఫరూఖ్. నిర్బంధంలో ఉన్న తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ సహా ఇతరులను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

220 రోజుల తర్వాత ఫరూఖ్​ అబ్దుల్లాకు 'స్వేచ్ఛ'

"నేను స్వేచ్ఛ పొందాను. నా స్వేచ్ఛ కోసం పార్లమెంట్​లో ఎందరో పోరాడారు. ఇప్పుడు నేను దిల్లీకి వెళ్లి పార్లమెంట్​లో ప్రజల గళం వినిపిస్తాను. నేను మీ ముందు ఓ స్వతంత్రుడిగా మాట్లాడుతున్నా. కానీ, ఇది అసలైన స్వతంత్రం కాదు. ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న ఎందరో నేతలను విడుదల చేయాలి. వాళ్లందరికీ విముక్తి దొరికే వరకు నేను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోను. నన్ను విడుదల చేయించేందుకు పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు."

-ఫరూఖ్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి

అధికరణ 370 రద్దు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫరూఖ్​పై పోలీసులు నిర్బంధం విధించారు. మొదట 2019 సెప్టెంబర్‌ 15న అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టాన్ని విధించిన కేంద్రం... డిసెంబర్‌ 13న మూడు నెలలు పొడిగించింది. ఫలితంగా 82 ఏళ్ల వయసులో ఫరూఖ్​ అబ్దుల్లా ఏడు నెలలపాటు గృహ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది.

అయితే, నిర్భంధ కాలాన్ని ఈ నెల 11న మరో మూడు నెలలు పొడిగించిన అధికారులు ఆకస్మాత్తుగా నేడు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు.

కశ్మీర్‌లో పరిస్థితులు కుదుపడి, శాంతియుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాతే గవర్నర్‌ తుది ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

హర్షం..

ఏడు నెలల తర్వాత ఫరూఖ్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి బయటికి రావడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్, సీపీఎం సీనియర్ నేత సీతారామ్ ఏచూరి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫరూఖ్ విడుదల ఆలస్యమైందని, ఇప్పటికైనా కేంద్రం మంచి అడుగు వేసిందని వ్యాఖ్యానించారు.

నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె.. ఇల్తిజా ముఫ్తీ ఫరూఖ్ విడుదలను స్వాగతించారు. 'ఇక ఈ నిర్బంధ శకానికి స్వస్తి పలకాలి. జైళ్లలో మగ్గుతున్న నేతలను విడుదల చేయాలి' అని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:ప్రకృతి వైపరీత్యాలతో... గూడు పోయి గోడు మిగిలె!

ABOUT THE AUTHOR

...view details