తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2020, 5:54 AM IST

ETV Bharat / bharat

పట్టు వీడని రైతన్న- మెట్టు దిగని సర్కార్!

నూతన సాగుచట్టాలపై ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికిి రైతు సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే రైతులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వం పునరుద్ఘాటించినా.. చట్టాల రద్దు తప్ప వేరే ఏదీ వద్దని అన్నదాతలు అంటున్నారు.

Farmers' protest
పట్టు వీడని రైతన్న- మెట్టు దిగని సర్కార్!

రైతుల ఆందోళన గురువారం 15వ రోజుకు చేరినా పరిష్కార మార్గం కనిపించడం లేదు. ఇరు పక్షాలూ తమ వాదనే వినిపిస్తుండటం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై పీటముడి పడటంతో తదనంతరం ఏమి జరుగుతుందనేదానిపై స్పష్టత కొరవడింది. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే ఆందోళనలను రైతు పట్టాలపైకి తీసుకువెళ్లాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రైతులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

ప్రతిపాదనలు పరిశీలించండి..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన తాజా ప్రతిపాదనలను పరిశీలించాలని తదుపరి చర్చల తేదీని వీలైనంత త్వరగా నిర్ణయించాలని రైతులను విజ్ఞప్తి చేశారు. చర్చలు జరుగుతోన్న సమయంలో తదుపరి ఆందోళన కార్యక్రమాలు ప్రకటించడం సరికాదన్నారు. రైతుల ఆందోళనల వెనుక ఏమైనా శక్తులున్నాయా అని పీయూష్​ గోయల్​ను ప్రశ్నించగా "మీడియా కళ్లు నిశితమైనవి. తన పరిశోధనాత్మక నైపుణ్యాలను ఉపయోగించి ఈ విషయాన్ని కనుక్కోవాలి" అని వ్యాఖ్యానించారు.

పిలిస్తే పరిశీలిస్తాం:రైతు నేతలు

"ఇంతవరకు ఐదు దఫాలుగా చర్చలు జరిగినా అసంపూర్తిగా ముగిశాయి. కేంద్రం మరోసారి ఆహ్వానం పంపితే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం."

- శివకుమార్​ కాకా, రైతు నాయకుడు

రైలుపట్టాలపై ఉద్యమం జరిగే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని మరో రైతు నాయకుడు బాబా సింగ్ అన్నారు. దిల్లీకి వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధిస్తామని తెలిపారు. చట్టాలను వ్యాపారం కోసమే చేసినట్లు కేంద్రం అంగీకరించిందని మరో నాయకుడు బల్బీర్​ సింగ్​ రాజేవాల్​ చెప్పారు.

సరిహద్దుల్లో అదే పరిస్థితి..

హరియాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రిలతో పాటు ఉత్తర్​ప్రదేశ్ సరిహద్దులోనూ ఆందోళన కొనసాగుతోంది. పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. నోయిడా- దిల్లీ లింక్​ రోడ్డును మాత్రం పాక్షికంగా తెరిచారు. రైతులకు తమవంతు సాయం అందించడానికి పంజాబ్​- హరియాణా క్రీడాకారులు ముందుకు వచ్చారు. దీక్షా స్థలిలో ఉన్న రైతుల దుస్తులు వారు ఉతుకుతున్నారు.

కేంద్రం ఏమంటోంది..

  • చట్టాల రద్దు ఉండదు.. సవరణలే..
  • భయాలు తొలగిస్తాం.. ఆందోళన ఆపండి
  • తదుపరి చర్చలకు తేదీ చెప్పండి
  • సంప్రదింపుల వేళ ఉద్యమ విస్తరణా?

రైతుల వాదన ఇదీ..

  1. చట్టాల రద్దు తప్ప మరో మాట లేదు
  2. అయిందు భేటీలైనా ఒరిగిందేమీ లేదు
  3. రైలు పట్టాలపై నిరసనలకు సిద్ధం
  4. దేశవ్యాప్త మద్దతు కూడగడతాం

ABOUT THE AUTHOR

...view details