"2012లో భారత్లో ఊబకాయంతో బాధపడుతున్న పెద్దలు 25.2 మిలియన్లు. 2016 నాటికి ఆ సంఖ్య 34.3 మిలియన్లకు పెరిగింది. 2019 నాటికి స్థూలకాయంతో ఇబ్బందులు పడుతున్నవారు ఏకంగా 135 మిలియన్లకు చేరుకున్నారు. "
భారత్లో స్థూలకాయం తీవ్రతపై ఐక్యరాజ్య సమితి చెప్పిన గణాంకాలు ఇవీ.
"అధిక బరువు ఉన్న వారికి కరోనా కారణంగా ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. వారికి ఐసీయూ తప్పనిసరిగా అవసరం అవుతుంది"
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) తాజా నివేదికలోని సారాంశం ఇదీ..
పీహెచ్ఈ నివేదికకు స్పందించిన బిటన్ ప్రభుత్వం.. దేశ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. వ్యాయామంతో కూడిన ప్రయాణాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్.. సైక్లింగ్ దానికి చక్కటి మార్గమని భావించారు.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా వేలాది మైళ్ల సైకిల్ మార్గాలను నిర్మించడానికి పూనుకున్నారు. హైవేల్లో సైక్లిస్టులు, పాదచారుల రక్షణ కోసం 2 బిలియన్ పౌండ్లను కేటాయించారు బోరిస్.
అలాగే అక్కడి వైద్యులూ ఆస్పత్రులకు వచ్చే రోగులను సైక్లింగ్ వైపు ప్రోత్సహిస్తుండటం గమనార్హం. అయితే ఊబకాయం సమస్య తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి కాగా.. ఇండియాలోనూ యూకే తరహాలో సైక్లింగ్ను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చూట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
" ఊబకాయులు కరోనా వైరస్ బారిన పడిన తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన వ్యాయామ మార్గాల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో స్థూలకాయానికి చెక్ పెట్టడానికి యూకే ప్రభుత్వం సైక్లింగ్ను ప్రోత్సహించాలనుకోవడం మంచి ఆలోచన. భారత్లో కూడా అలాంటి నిర్ణయాలు అవసరం. ప్రధానంగా ముఖ్య పట్టణాల్లో బైక్లను పక్కన పెట్టి.. సైక్లింగ్కు అలవాటు పడేలా యంత్రాంగం చొరవ చూపాలి. "
-నవీన్ సతీజా, సీనియర్ కన్సల్టెంట్-లాప్రోస్కోపిక్ సర్జరీ, గురుగ్రామ్
నవీన్ సతీజాతో పాటు అనేకమంది ఆరోగ్య నిపుణులు అధిక బరువు సమస్యకు సైక్లింగ్ చక్కటి పరిష్కార మార్గమని అభిప్రాయపడుతున్నారు.