బహుజన సిద్ధాంతకారులు దళిత సిద్ధాంతకారులు విద్యాబోధన తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలని, ఉన్నత వర్గాల పిల్లలు అందరూ ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుతుంటే... దళిత బహుజనుల పిల్లలు సర్కారీ బడుల్లో తెలుగు మాధ్యమంలో చదివి ఎల్లకాలం వెనకబడి ఉండాలా అనే కొత్తవాదన తెస్తున్నారు.
దళిత కులాలు, వెనకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత చదువుల అనంతరం విదేశాలకుపోయి మంచి ఉద్యోగాలు చేయాల్సిందే. అందుకు కావలసింది ఆంగ్లభాషలో ప్రావీణ్యం కాని, ఇంగ్లిష్ మీడియంలో చదువు కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బోధించే ఇంగ్లిష్ మీడియం చదువుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం బాగోలేవన్నది వాస్తవం. ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివినవారిలో కొందరిని పరిశీలిస్తే అటు తెలుగులో, ఇటు ఇంగ్లిష్లో సరైన ప్రావీణ్యం వారికి లేదని గ్రహించవచ్చు. అరకొర సౌకర్యాలతో, అర్ధజీతాలతో పనిచేసే ప్రైవేటు కళాశాలలు ఏ ప్రమాణాలు పాటిస్తున్నాయో ప్రభుత్వ పరిశీలనలోనే చాలాసార్లు బయటపడింది. మన దగ్గర ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఎక్కువమంది ఇంగ్లాండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు పోతున్నారు. అక్కడ వారికి నేరుగా విద్యా ప్రవేశాలు, ఉద్యోగాలు లభించడం లేదు. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఆంగ్ల భాష పాటవానికి సంబంధించిన పరీక్షలివి. మన దగ్గర ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులూ మొదటిసారే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. కోచింగ్ కేంద్రాలకు వెళ్లి, డబ్బులు పోసి శిక్షణ పొందుతున్నారు. రెండు పరీక్షలు దాటకుండా ఎవరూ పై దేశాల్లో ఉన్నత విద్యలో ప్రవేశం పొందలేరు. ఉద్యోగాలూ సాధించలేరు. జపాన్, చైనాల్లో తయారైన యంత్రాలను చాలా దేశాల్లో వాడుతున్నారు. తర్ఫీదు ఇవ్వడానికి ఆ రెండు దేశాల నిపుణులు ఆయా దేశాలకు వెళ్తుంటారు.
నాణ్యత ప్రశ్నార్థకం
వారంతా ఇంజినీరింగ్, ఇతర కంప్యూటర్ సాంకేతిక విద్యలను వారి భాషల్లో నేర్చుకున్నారు. ఇంగ్లిష్ను కనీస వ్యాపార లావాదేవీలు, దైనందిన వ్యవహారాలు నడుపుకొనేవరకే నేర్చుకుంటారు. మన దేశంలో ఇంజినీరింగ్ కంప్యూటర్ విద్యలను ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు ఆ సాంకేతిక రంగంలో వారితో పోటీ పడగలుగుతున్నారా? అలాకాక ఇంజినీరింగ్, వైద్యవిద్యలను ఇతర శాస్త్రాలను భారతీయ భాషల్లోనే ఆయా ప్రాంతాలవారు నేర్చుకున్నా- ఇంగ్లిష్ను ఒక భాషగా నేర్చుకోగలిగితే, ఇటు ఈ శాస్త్రాలనూ సులభంగా అభ్యసించవచ్చు. ఆంగ్లాన్ని ఒక భాషగా అన్ని తరగతుల్లో నేర్చుకోవడం వల్ల ఇతర దేశాల్లోనూ పని చేయడానికి వీలవుతుంది. సాంకేతిక విద్యలో మనకన్నా చాలా ముందున్న చైనా, రష్యా, జపాన్ దేశస్థులు వారి భాషల్లో విద్యాబోధన సాగిస్తూ మెరుగ్గా రాణిస్తున్న ఉదాహరణ మన ఎదురుగానే ఉంది. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయన్నది విడ్డూర వాదన. పౌరుల్లో ఏ వర్గం వారైనా ప్రభుత్వం నుంచి కోరవలసింది- చదువు తెలుగు మాధ్యమంలోనే ఉండాలి కాని, తమకు చక్కటి ఆంగ్లాన్ని పాఠశాల స్థాయిలోనే నేర్పించాలని, అందుకు వీలుగా మంచిశిక్షణ పొందిన ఆంగ్ల ఉపాధ్యాయులను ఇవ్వమని అడగాలి. పైగా తెలుగులో చదువుకుంటేనే శాస్త్రాలు సులభంగా బోధపడి, ఎవరైనా అభివృద్ధిలోకి రాగలుగుతారు. ప్రభుత్వ బడుల్లోనే కాదు- అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధన సాగాలని భాషావాదులు కోరుకుంటున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 1918లో నిజాం ప్రారంభించారు. విద్యాబోధన అంతా ఉర్దూ మాధ్యమంలో జరిగేలా నిర్దేశించారు. దేశంలో తొలిసారిగా ఓ భారతీయ భాష విద్యాబోధన మాధ్యమంగా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం చాలా మెచ్చుకోదగిన అంశమంటూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పట్లో ఉత్తరం రాశారు. వందేళ్ల క్రితమే ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి సాంకేతిక విద్యను, ఉన్నత విద్యను ఉర్దూ మాధ్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అందించింది. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి లాంటి వారు ఉర్దూలోనే మెడిసిన్ చదువుకున్నారు. స్వాతంత్య్రానంతరమే ఇక్కడ మీడియం మారింది. 1970 దశకం నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో పాఠ్యగ్రంథాలు తయారు చేయించి బోధించారు. కొన్ని సామాజిక శాస్త్రాల్లో పీజీ పుస్తకాల్నీ తెలుగులో రాయించారు. ఈ పని అంతా తెలుగు అకాడమీ చేసింది. నాడు కేంద్రమంత్రిగా ఉన్న పి.వి.నరసింహారావు ముందుచూపువల్లే తెలుగు అకాడమీ ఏర్పాటు, తెలుగు మాధ్యమం అమలు సాధ్యమయ్యాయి. విద్యారంగంలో ప్రైవేటు వ్యాపారం పుంజుకొన్న దరిమిలా ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనే తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా విజ్ఞత చూపించి నిజమైన అభివృద్ధి సొంత భాష ద్వారా సాధ్యమనే విషయాన్ని ప్రజలకు గట్టిగా తెలియజెప్పాలి.