తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2020, 4:16 PM IST

ETV Bharat / bharat

ఈ-విన్ వ్యవస్థతో భారత్​లో కరోనా టీకా పంపిణీ

దేశంలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చాక పంపిణీ, ట్రాకింగ్​ కోసం అధునాతన ఎలక్ట్రానిక్​ వ్యాక్సిన్​ ఇంటిలిజెన్స్​ వ్యవస్థను(ఈ-విన్) మరింత అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపింది కేంద్రం. నిరంతరం రియల్​ టైంలో వ్యాక్సిన్​ సమాచారం తెలుసుకునేందుకు ఈ వ్యవస్థను వినియోగించనున్నట్లు తెలిపింది.

Electronic Vaccine Intelligence Network to track COVID-19 vaccine
వ్యాక్సిన్​ ట్రాక్సింగ్​ కోసం అధునాత ఈ-విన్​ వ్యవస్థ

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. దేశవ్యాప్తంగా పంపిణీ చేయటం సహా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు అధునాతన వ్యవస్థను వినియోగించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అందుకోసం దేశంలోని అన్ని కోల్డ్​ చైన్స్​లో స్టాక్​, ఉష్ణోగ్రతలపై రియల్​ టైంలో సమాచారం అందించే ఎలక్ట్రానిక్​ వ్యాక్సిన్​ ఇంటిలిజెన్స్​ వ్యవస్థ(ఈ-విన్​)ను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు రాజ్యసభకు తెలిపారు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్​ చౌబే.

కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీ కోసం ఇప్పటికే జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు చౌబే. ఈ బృందం.. వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలి, వ్యాక్సిన్​ క్యాండిడేట్ల ఎంపిక, సరఫరా ప్రక్రియ, కోల్డ్​ చైన్​, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనుందని పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఏ విదేశీ ఫార్మా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు చౌబే.

కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రభుత్వం ఏదైనా రోడ్​మ్యాప్​ను రూపొందించిందా అని అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు చౌబే.

"వ్యాక్సిన్​ దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, ఇతర పంపిణీ స్టేషన్లకు సరఫరా అవుతుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఈ-విన్​ వ్యవస్థను ఆరోగ్య అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్​ అవసరాలు, ట్రాకింగ్​ కోసం ఈ-విన్​ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నాం. భారత్​లో వ్యాక్సిన్​ రూపొందిస్తున్న ఏడు సంస్థలకు ప్రీక్లినికల్​ టెస్ట్​, పరిశీలన, విశ్లేషణ కోసం అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్​సీఓ) తెలిపింది. రెండు వ్యాక్సిన్​ క్యాండిడేట్ల తొలిదశ ట్రయల్స్​ మంచి ఫలితాలు ఇచ్చాయి. రెండో దశ ట్రయల్స్​ ప్రారంభమయ్యాయి."

- అశ్విని కుమార్​ చౌబే, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి.

అందుకే ఆ వ్యూహాన్ని అనుసరించలేదు..

కరోనా కట్టడికి వైద్యపరంగా సరైన పరిష్కార మార్గాలు కనుగొనక ముందే ప్రజల్లో హెర్డ్​ ఇమ్యూనిటీ అభివృద్ధి చేసే ప్రయత్నాలు అనారోగ్యాలు, మరణాల పరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని కుమార్​ చౌబే. కరోనా తొలినాళ్లలో సహజసిద్ధ పద్ధతుల్లో హెర్డ్​ ఇమ్యూనిటినీ పెంపొందించాలని ప్రయత్నించిన దేశాల్లో కేసులు, మరణాలు అధికంగా ఉన్నట్లు గుర్తుచేశారు. అందుకే ఆ వ్యూహాన్ని వదిలివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. హెర్డ్​ ఇమ్యూనిటీ కోసం రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయా అన్న ప్రశ్నకు.. కరోనా వ్యాప్తి గొలుసును విడగొట్టి కట్టడి చేసే వ్యూహాలపై అవసరమైన ప్రణాళిక, విధానం, మార్గదర్శకాలను రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: చైనాలో మరో వ్యాధి- వేల మందికి పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details