నోట్ల రద్దు.... మోదీ ప్రభుత్వం తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో ఒకటి. ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఈ విషయం తమిళనాడుకు చెందిన ఇద్దరు వృద్ధులకు మాత్రం తెలియదు. వారే... తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని పూమలూర్ గ్రామానికి చెందిన రంగమ్మళ్(73), తంగమ్మళ్(78). ఇద్దరూ తోబుట్టువులు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు
దాదాపు 20 ఏళ్లుగా పశువులను అమ్మడం, పొలంలో కూలి పని చేయడం ద్వారా వచ్చే డబ్బుతో దాదాపు రూ.46 వేలు కూడబెట్టుకున్నారు. ఈ మొత్తంలో రంగమ్మళ్ రూ. 24 వేలు, తంగమ్మళ్ రూ. 22 వేలు పోగు చేశారు. వారి అంత్యక్రియలకు, మనువళ్లు, మనువరాళ్లకోసం ఈ సొమ్మును దాచుకున్నారు. కుమారులకు మద్యం సేవించే అలవాటు ఉన్నందున.. వారికి ఈ విషయం చెప్పకుండా, ఇంట్లోని బియ్యం బస్తాలు, అల్యూమినియం పెట్టెలు, నడుముకు కట్టుకునే సంచుల్లో డబ్బు దాచుకుంటూ వచ్చారు.
తంగమ్మళ్కు ఇటీవల అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. చికిత్స కోసం దాచుకున్న డబ్బును బయటకు తీశారు. తీరా చూస్తే ఆ నోట్లు మూడేళ్ల క్రితమే రద్దయ్యాయని తెలిసింది. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం జిల్లా కలెక్టర్ విజయ్ కార్తికేయన్ వరకు చేరింది. ఆయన చొరవతో ఆ ఇద్దరు వృద్ధులకు వైద్య సాయం, పింఛను అందుతున్నాయి.