తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2020, 12:13 PM IST

ETV Bharat / bharat

ఒకే దేశం-ఒకే విధానంతో మోదీ స్వప్నం నెరవేరేనా?

భారత​ దేశ ప్రత్యేకత.. భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని బేధాలున్నా.. ఒకే తాటిపై, ఒకే లక్ష్యంతో, ఒకే శక్తిగా నిలబడిన విశిష్టత భారత్​ సొంతం. భౌగోళికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా వేర్వేరు పరిస్థితులు, వ్యవస్థలు ఉన్నా... సమాఖ్య స్ఫూర్తితో 'భారత్'​గా నిలబడడం మనకే సాధ్యం. ఇలాంటి ఐక్య భారత్​ను ఏకీకరణ మంత్రంతో శ్రేష్ఠ భారత్​గా తీర్చిదిద్దేందుకు యత్నిస్తోంది కేంద్రం. ఈ ఐక్యతా యజ్ఞంలో ఇప్పటివరకు ఏం సాధించింది? ఇంకా చేయాల్సిందేంటి?

Ek Bharat Sresht Bharat
ఏక్​ భారత్​... శ్రేష్ఠ్​ భారత్​: ప్రధాని కలవైపు క్రమంగా అడుగులు

'ఏక్​ భారత్​- శ్రేష్ఠ్ భారత్​'... ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం. చారిత్రకంగా, వారసత్వంగా ఘనమైన స్ఫూర్తి ఉన్న భారత్​లో.. ఆ సమైఖ్యతా భావం ఉట్టిపడేలా అన్ని అంశాలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చేసేందుకు యత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ​అందులో భాగంగానే జాతీయ సమగ్రత పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. వినూత్న విధానాలతో ముందుకొస్తోంది.

దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేలా.. ఏకీకృతం చేసే పథకాలు ప్రవేశపెడుతోంది మోదీ సర్కార్​. కొత్త చట్టాలు చేస్తోంది. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు... వ్యవసాయం నుంచి విధానాలు రూపొందించే నాయకులను ఎన్నుకునే ఎన్నికల వరకు.. అన్ని ఒక్కచోట, ఒకేసారి, ఒకేలా జరిగేందుకు అనేక నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తోంది.

గతంలో మొబైల్ నెట్​వర్క్​లు విభిన్న రాష్ట్రాల్లో వేర్వేరు టారిఫ్​లతో ఉండేవి. రాష్ట్రాల సర్కిళ్లకు అనుగుణంగా ధరలు నిర్ణయించేవారు. వేరే రాష్ట్రంలోకి వెళ్తే రోమింగ్​ ఛార్జీలు పడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్​లిమిటెడ్​ నేషనల్​ కాలింగ్​ అందుబాటులోకి వచ్చింది. ఆ మార్పు ఎంతో అవసరం కూడా. ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న తరుణంలో.. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని అందనంత ఎత్తుకు వెళ్లాలే తప్ప... రాష్ట్రం-ప్రాంతం అంటూ గిరిగీసుకుని కూర్చుంటే దేశమే నష్టపోతుంది. ఐరోపాలో వివిధ దేశాలు సమాఖ్యగా ఏర్పడి.. ఎలాంటి అభివృద్ధి పథంలో వెళ్తున్నాయో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇదే రీతిలో... వ్యత్యాసం వద్దంటూ... ఒకే విధానం, ఒకే దేశం అన్న జాతీయవాదాన్ని మోదీ ప్రభుత్వం నెత్తినపెట్టుకుంది.

ఒకే దేశం-ఒకే పన్ను

"దేశంలో అతిపెద్ద ఆర్థిక విప్లవం వస్తు, సేవల పన్ను అమలుతో మొదలైంది"... మూడేళ్ల కిందట జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొస్తూ ప్రధాని మోదీ చెప్పిన మాట. అవినీతి, నల్లధనాన్ని నిరోధించి సామాన్యులకు మేలు చేయాలనే ఈ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం నాడు చెప్పింది.

ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశం ఒక్కటే కాబట్టి, దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పన్నే జీఎస్‌టీ. అందులో 0, 5, 12, 18, 28 శాతాలంటూ రకరకాల శ్లాబులు విధించింది.

గతంలో పాత పన్నుల విధానంలో మార్పుచేర్పులు చేస్తూ పన్నెండేళ్ల క్రితం అన్ని వస్తువులపైనా ‘వ్యాట్‌ అనే పన్నును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని అన్ని రాష్ట్రాలూ విజయవంతంగా అమలు చేస్తూ వచ్చాయి. కానీ అందులోనూ ఎన్నో లొసుగులు. అందుకే ఆ విధానం మారి పటిష్ఠమైన మరో కొత్త విధానం అమల్లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. దానికోసమే ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలూ, ఆర్థిక నిపుణులూ సాగించిన మేధోమథనం నుంచి పుట్టిన కొత్త పన్నుల విధానమే జీఎస్‌టీ. ఒకే దేశం-ఒకే పన్ను. దేశంలో ఎక్కడైనా ఒకటే లెక్క.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ ప్రత్యేకం: జీఎస్టీ ప్రస్థానానికి రెండేళ్లు

ఒకే దేశం-ఒకే మార్కెట్​

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించేదే ఈ విధానం. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం సాధన కోసం మోదీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది.

కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించకూడదు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. సువిశాలమైన భారతదేశం అంతటా పంటల క్రయవిక్రయాలకు ఒకే చట్టం.

మార్కెట్లు యధావిధిగా కొనసాగుతాయి. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ చట్టం ఉద్దేశమంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కేంద్రం తీసుకువస్తున్న కాంట్రాక్టు వ్యవసాయ చట్టం, మరో రెండు చట్టాల వల్ల రైతులు ఎన్నో లాభాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చూడండి: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?

ఒకే దేశం-ఒకే పరీక్ష

నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక సంస్కరణకు ఎన్డీఏ సర్కారు నడుం బిగించింది. ఒకే దేశం- ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం ‘జాతీయ నియామకాల సంస్థ’-ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైల్వే, బ్యాంకింగ్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కింద వేర్వేరుగా భర్తీచేసే ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు పౌరుడెవరైనా పరీక్ష రాసేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ కొలువు కొట్టేయొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఇదో విప్లవాత్మక సంస్కరణగా నిలిచిపోనుందనేది కేంద్రం మాట. అదే దారిలో నీట్​ పరీక్షను తీసుకొచ్చింది. మెడికల్​ ప్రవేక్ష పరీక్షతో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేసింది.

అంతకుముందే విద్యా విధానంలోనూ సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్రం. జాతీయ నూతన విద్యా విధానానికి ఆమోదముద్ర వేసింది. ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పుల బాటలు వేస్తున్నారు. కొత్త విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను చదువుకొనే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భారంగా మారిన పాఠ్యాంశాలను తగ్గించి, విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించుకొనే అవకాశం ఇవ్వబోతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే విద్యావిధానం.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

ఒకే దేశం-ఒకే రేషన్​

'ఒకే దేశం-ఒకే రేషన్‌కార్డు'... పేదలకు వరప్రదాయనిగా నిలిచే ఈ సంస్కరణను తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పథకం కింద సొంత రాష్ట్రం నుంచి వలస వెళ్లేవారు జాతీయ ఆహార భద్రత చట్టం కింద తమ ఆహార ధాన్యాలను ఏ రాష్ట్రంలోనైనా పొందవచ్చు. ప్రత్యేకించి వలస కార్మికులు, వారి కుటుంబాలు దేశంలోని ఏ చౌక ధరల దుకాణంలోనైనా సరకులు తీసుకోవచ్చు. లబ్ధిదారులను కచ్చితంగా గుర్తించడానికి, నకిలీ, అనర్హ కార్డుదారులను తొలగించడానికి కూడా ఈ విధానం సమర్థంగా తోడ్పడుతుంది.

ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు విధానం వల్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడటమేగాక సంక్షేమ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరుతుంది. ఇందుకు తగినట్లుగా రేషన్‌ కార్డుల అంతర్రాష్ట్ర బదిలీ సరళంగా సాగేందుకు రేషన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేస్తారు. అలాగే లబ్ధిదారుల బయోమెట్రిక్ వివరాలన్నిటినీ దేశంలోని అన్ని చౌక ధరల దుకాణాలతో యాంత్రిక పద్ధతిలో జోడిస్తారు. ఆ వివరాల నిర్ధరణ కోసం ఆయా దుకాణాల్లో ‘ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌’ పరికరాలను అమరుస్తారు.

ఇదీ చూడండి: 'ఒకే దేశం- ఒకే రేషన్ ​కార్డు అమలు సాధ్యమా?'

ఒకే దేశం-ఒకే గుర్తింపు

ఆధార్​.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు కార్డు. అయితే గుర్తింపు కార్డులకు మరికొన్ని హంగులు జోడించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరులందరికీ ఒకే దేశం.. ఒకే గుర్తింపు కార్డును తీసుకురానుంది. ఈ కార్డు అన్ని అవసరాలకూ ఉపయోగపడేలా దేశమంతా ఒకేలా ఉండనుంది.

ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా... ఈ అవసరాలన్నింటికీ ఒకే బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు రూపొందించే ఆలోచనలు చేస్తోంది. అది ఆచరణ సాధ్యమని భావిస్తోంది. వేర్వేరు పత్రాల అవసరం ఉండకుండా.. అన్నీ ఒకే కార్డులో నిక్షిప్తం చేసేలా రూపొందించనుంది. అధునాతన సాంకేతికత వినియోగించి.. గుర్తింపు కార్డులన్నింటికీ సమాధానంగా ఒకే గుర్తింపు కార్డును తీసుకొస్తామంటోంది కేంద్రం.

ఇదీ చూడండి: ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

ఒకే దేశం-ఒకే ఎన్నిక

జమిలి ఎన్నికలు... కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా విపిస్తోన్న మాట. ఒకే దేశం-ఒకే ఎన్నిక-ఒకే సమయం... ఇది జమిలి ఎన్నిక అర్థం. కేంద్రం ఈ అంశంపై ప్రత్యేకంగా కృషి చేస్తోంది.

నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. 1967 వరకు ఎన్నికలు అలాగే జరిగేవి. 1951-52, 1957, 1962, 1967లో లోక్‌సభ ఎన్నికలతోపాటే... రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చాలా రాష్ట్రాలలో రాజకీయాలు అనిశ్చితికి దారి తీశాయి. క్రమంగా లోక్‌సభ స్థాయిలోనూ అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఐదేళ్ల కాలపరిమితి కన్నా ముందే కొన్నిసార్లు లోక్‌సభ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో రెండు సార్వత్రిక ఎన్నికల మధ్యకాలంలో ప్రతి ఏడాది ఎన్నికలు ఉండే విధానం తయారైంది.

ఈ నేపథ్యంలో 2016 మార్చిలో ప్రధాని మోదీ... జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. 2017లో నీతి ఆయోగ్... ఇందుకు సంబంధించి ఓ నివేదిక ఇచ్చింది. 2018లో కొన్ని అభ్యంతరాలతో లా కమిషన్ తన నివేదిక సమర్పించింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం సరైన విధానమని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏటా ఎక్కడో చోట ఎన్నికలు రావటం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే అయ్యే ఖర్చును 50:50 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అలా కాక రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఖర్చునంతా రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు దృష్టితో చూస్తే జమిలి ఎన్నికల విధానం రాష్ట్రాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.

మరోవైపు ప్రతి ఎన్నికకు ముందు వాటి తీవ్రతను బట్టి ఒక నెల ముందుగానో రెండు నెలల ముందుగానో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుంది. ఇక అప్పటి నుంచి ప్రధానమంత్రి, వారి మంత్రివర్గ సహచరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నులవుతారు. 2014–19 మధ్య జరిగిన ఎన్నికల ప్రచార సమయాన్ని పరిశీలిస్తే మొత్తం ఐదేళ్లలో 1/3 సమయం కేవలం ఎన్నికల ప్రచారానికి సరిపోయింది. సార్వత్రిక ఎన్నికల తరువాత కొలువుదీరిన ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ఐదేళ్లు పూర్తిగా మధ్యలో ఏ చికాకులు లేకుండా పరిపాలన పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉండాలి. జమిలి ఎన్నికలు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించగలవన్నది ప్రభుత్వ వాదన.

మొత్తంగా విభిన్న అంశాలలో.. ఒకే విధానం అమలు పర్చేందుకు ఆసక్తి చూపుతోంది మోదీ సర్కార్​. ఏక్​ భారత్​- శ్రేష్ఠ్​ భారత్​ అన్న దిశగా అడుగులు వేస్తోంది.

ఇదీ చూడండి: 'తదుపరి లక్ష్యం... ఒకే దేశం- ఒకే ఎన్నిక'

ఇదీ చూడండి: 'ఒకే దేశం ఒకే ఎన్నిక' పై భిన్న స్వరాలు

ABOUT THE AUTHOR

...view details