ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకు భారత్ పుట్టినిల్లు. క్రమక్రమంగా భారతీయ విశ్వవిద్యాలయాల ప్రమాణాలు అడుగంటిపోతున్నాయి. 2020 సంవత్సరానికి ‘క్యూఎస్’ ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ను ప్రకటించింది. తొలి 200 విశ్వవిద్యాలయాల్లో భారత్ నుంచి ఐఐటీ (ముంబయి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), ఐఐటీ (దిల్లీ) మాత్రమే చోటు సంపాదించుకున్నాయి. దేశంలో ఉన్నత విద్యాసంస్థ ప్రమాణాల తీరుతెన్నులు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ ర్యాంకులే నిదర్శనం.
ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థులను ఆకర్షించే ముందు దేశీయ అవసరాలకు తగ్గట్లుగా, ప్రమాణాల పరంగా ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచస్థాయి ప్రమాణాలను మన దేశంలోనూ అమలుచేసే దిశగా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సంప్రదాయ కోర్సుల స్థానంలో కాలానుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే సాంకేతిక అంశాలతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టాలి. అప్పుడు విశ్వవిద్యాలయాలు నిరుద్యోగుల్ని తయారు చేసే కేంద్రాలుగా కాకుండా ఉత్తమ మానవ వనరుల తయారీ సంస్థలుగా విరాజిల్లుతాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో జీడీపీ పరంగా చూస్తే భారత్ ఏడో స్థానంలో ఉంది. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ముందంజలో ఉంది. అంకుర పరిశ్రమల స్థాపనలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు గుర్తింపు పొందాయి. భారతీయ మూలాలు గల సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ తమతమ రంగాల్లో చెరగని ముద్ర వేశారు. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ‘ఫార్చ్యూన్ 500’ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఆంగ్లంలో మాట్లాడటంలో భారతీయ విద్యార్థులు చైనాతో పోల్చితే చాలా మెరుగ్గా ఉన్నారు. భిన్న సంస్కృతి, భాషలు, సంప్రదాయాలు, మతాలు కలిగి ఉండటం భారత్కు సానుకూల అంశంగా పేర్కొనవచ్చు.
విద్యార్థుల సంఖ్య పెంచే లక్ష్యంగా
స్టడీ ఇన్ ఇండియా (భారత్లో విద్యాభ్యాసం) పథకం కింద దేశంలో సుమారు 70వేల విదేశీ విద్యార్థులు ఉన్నట్లు అంచనా. దీన్ని 2022 సంవత్సరానికి రెండు లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా కొన్ని విశ్వవిద్యాలయాలు రుసుముల మినహాయింపు, ఉపకార వేతనాలు ఇవ్వడం ద్వారా విదేశీ విద్యార్థులను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
2015 నుంచి రంగాలవారీగా బోధనలో నిష్ణాతులు, వ్యాపార ప్రముఖులు, శాస్త్రవేత్తలను ప్రపంచ ప్రఖ్యాత సంస్థలనుంచి ఆహ్వానించడం ప్రారంభించారు. స్పార్క్ (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసర్చ్ కొలాబరేషన్) ద్వారా 500 ప్రపంచస్థాయి విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకొనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోని వందలోపు ర్యాంకున్న విద్యాసంస్థలకు పెద్దమొత్తంలో ఆర్థిక సహాయం కల్పించేందుకు చర్యలు చేపట్టడం హర్షించదగ్గ విషయం. ఈ విశ్వవిద్యాలయాలతో మిగతా విశ్వవిద్యాలయాలను అంతర్జాలం ద్వారా అనుసంధానం చేసి అందరికీ నాణ్యమైన ఉన్నతవిద్య అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. మెరుగైన విద్యావిధానం, సౌకర్యాల కల్పన ద్వారా అమెరికా లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఆకర్షిస్తున్నాయి.