సడలింపులతో అమల్లోకి వచ్చిన మూడోదశ లాక్డౌన్తో సోమవారం నుంచి దేశంలో పలు ప్రాంతాల్లో సందడి మొదలైంది. రహదారులపైకి ట్రక్కులు సహా భారీ వాహనాలు వచ్చాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో క్యాబ్ సేవలూ మొదలయ్యాయి. వందకు పైగా నగరాల్లో క్యాబ్లు నడిపినట్లు ఓలా ప్రకటించింది. ఎరువుల తయారీ, మద్యం ఉత్పత్తి, ఆటోమొబైల్, వస్త్ర పరిశ్రమల్లో కార్యకలాపాలను గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. మార్కెట్లకు వస్తున్నవారు దూరం పాటించేలా చూడడం సవాల్గా మారింది.
అనివార్యమైతే సడలింపులు వెనక్కి
కట్టడి నిబంధనలు, పరిశుభ్రత, దూరం పాటించే విషయంలో ఏమాత్రం అలసత్వం కనిపించినా సడలింపులను వెనక్కి తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. సామాజిక సంచారం వల్ల వైరస్ విస్తరణ వ్యాప్తి ప్రమాదం ఎక్కువవుతుందని, దానిని దృష్టిలో పెట్టుకుని వీటికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కేరళలో వరసగా రెండోరోజూ కొత్త కేసులేమీ బయటపడలేదు. ఈశాన్య రాష్ట్రాలు, అనేక చిన్న రాష్ట్రాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది. తమిళనాడులో మాత్రం అమాంతం పెరిగిపోయాయి. మహారాష్ట్ర, గుజరాత్లలో తీవ్రత ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటివరకు కేసులు లేని ప్రాంతాల్లో ఇప్పుడు గానీ కరోనా బయటపడినట్లయితే ఆంక్షల్ని మళ్లీ అమలు చేస్తారు. ‘‘కేసుల సంఖ్య ఎప్పటికి గరిష్ఠ స్థితికి చేరుతుందన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది. నియంత్రణ చర్యల్లో మనం విఫలమైతే కేసులు ముమ్మరంగా పెరుగుతాయి’’ అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
బిహార్లోని 38 జిల్లాల్లో గ్రీన్ జోన్లు లేవని ఆ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే చెప్పారు. మే-జూన్ మధ్య కేసుల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుతుందని కొందరు భావిస్తుండగా.. కేంద్రం మాత్రం అలాంటి పరిస్థితే రాదని చెబుతోంది.