ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. విదేశాల్లోని అర్హత కలిగిన భారతీయులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శికి నవంబర్ 27న లేఖ రాసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల విశ్వాసం పెరిగిందని పేర్కొంది.
రానున్న అసోం, బంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేయడానికి కావాల్సిన సాంకేతిక, పరిపాలనపరమైన సదుపాయాలను సిద్ధం చేసుకున్నట్లు లేఖలో వెల్లడించింది ఈసీ. వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ నెలల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.