అభివృద్ధి చెందిన దేశాల తరహాలో భారత్లో కరోనా మహమ్మారితో దుర్భర పరిస్థితులు వస్తాయని ఊహించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్. కరోనాను కట్టడి చేయటంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందని స్పష్టం చేశారు.
కొవిడ్-19 పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు కేంద్ర మంత్రి.
" చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న దుర్భర పరిస్థితులు భారత్లో వస్తాయని మేము అనుకోవడం లేదు. కానీ.. ఇప్పటికే అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశం మొత్తాన్ని సిద్ధం చేశాం. మన దేశంలో మరణాల రేటు 3.3 శాతంలోనే కొనసాగుతోంది. కోలుకుంటున్న వారి సంఖ్య 29.9 శాతానికి పెరిగింది. మెరుగైన స్థితిలో ఉన్నామనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కేసుల రెట్టింపు రేటు గత మూడు రోజులగా చూసుకుంటే 11 రోజులుగా ఉంది. 7 రోజుల కేసులను చూస్తే రెట్టింపు రేటు 9.9 రోజులుగా ఉంది."
– డా. హర్షవర్ధన్, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి.