భారీ వర్షాలకు పుణెలో ఓ సొసైటీ ప్రహరీ గోడ కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పొట్ట కూటికోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. ఈ ప్రమాదానికి వారిని పనికి తీసుకొచ్చిన భవన నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పుణె జిల్లా పాలనాధికారి నవాల్ కిశోర్ రామ్ తెలిపారు. కూలీలను పక్కా భవనాల్లో ఉంచితే ఇంత భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టి.. కారకులపై కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు కలెక్టర్.
ఘటనాస్థలంలో మాట్లాడుతున్న కలెక్టర్ కిశోర్ రామ్
" భారీ వర్షం కారణంగా రాత్రి ప్రహరీ గోడ కూలిపోయింది. భవన నిర్మాణ సంస్థ కార్మికుల కోసం రేకులతో షెడ్లు నిర్మించటమే దురదృష్టకరం. రేకుల షెడ్లపై భారీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణం కేవలం నిర్మాణ సంస్థ అశ్రద్ధ, నిర్లక్ష్యమనే తెలుస్తుంది. ఇంత మంది చనిపోవటం చిన్న విషయం కాదు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికితీసి పంచనామాకు పంపించారు. బాధితులు ఎక్కడి నుంచి వచ్చారనేదానిపై సమాచారం సేకరిస్తే.. దాదాపుగా బిహార్,బంగాల్ నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహాయనిధి, ఎన్డీఆర్ఎఫ్ నియమాల ప్రకారం ఇచ్చే సాయాన్ని బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం. "
- నవాల్ కిశోర్ రామ్, పుణె జిల్లా పాలనాధికారి.
ఇదీ చూడండి: పుణె: ప్రహరీ గోడ కూలి 17 మంది బలి