తెలంగాణ

telangana

బిహార్​లో రాజకీయ సునామీ- త్వరలోనే కొత్త పొత్తులు!

By

Published : Jul 13, 2020, 5:58 PM IST

Updated : Jul 13, 2020, 6:05 PM IST

బిహార్​లో రాజకీయ గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాలనే తేడా లేకుండా ప్రతి చోట అనిశ్చితి తాండవిస్తోంది. సీట్ల పంపకం విషయంలో ఎన్​డీఏలో మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ఆర్​జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిలో నాయకత్వంపై అసంతృప్తి రాజ్యమేలుతోంది. వీటన్నింటి మధ్య రాష్ట్రంలో త్వరలో కొత్త పొత్తులు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

Differences brew in NDA, opposition camps in poll-bound Bihar
బిహార్ రాజకీయాల్లో సమూల మార్పులు- త్వరలోనే కొత్త పొత్తులు

సీట్ల కోసం ఎన్​డీఏలోని జనతా దళ్ యునైటెడ్(జేడీయూ), లోక్​జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ) మధ్య అభిప్రాయ భేదాలు... నాయకత్వం విషయంలో ప్రతిపక్ష శిబిరంలో అసంతృప్తి... అధికార పక్షంలోని అసంతృప్త నేతలతో చర్చిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటనలు.

ఇలా.. ఎన్నికలకు ముందే బిహార్​ రాజకీయం వేడెక్కింది. పార్టీల మధ్య కలహాలు ఎక్కువవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల్లో కొత్త పొత్తులు చూసే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. కూటముల్లో సమూల మార్పులు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సీట్ల కోసం ఎల్​జేపీ పట్టు

ప్రస్తుతం బిహార్​లో అధికార పార్టీ జనతా దళ్ యునైటెడ్​, లోక్​ జనశక్తి పార్టీ... ఎన్​డీఏలో ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో మిత్రపక్షం తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తోందన్న కారణాలతో ఎల్​జేపీలో అసంతృప్తి పెరిగిపోయింది.

ఇదీ చదవండి:పాసవాన్​... ఎన్​డీఏకి షాక్​, ఆర్​జేడీకి బ్రేక్​ ఇస్తారా?

భాజపా, ఎల్​జేపీ మధ్య రాజకీయ సమీకరణాలు బాగానే కనిపిస్తున్నా.. చిరాగ్ పాసవాన్(ఎల్​జేపీ అధ్యక్షుడు) పదేపదే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​పై విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎల్​జేపీని వదిలి మరో పార్టీని చూసుకోవాలని భాజపాకు చిరాగ్ పరోక్షంగా సందేశం ఇస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

"బిహార్​లో ఎల్​జేపీ తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటోంది. చిరాగ్ పాసవాన్ చాలా అత్యాశపడుతున్నారు. జేడీయూకు ఎల్​జేపీ అసలు మిత్రపక్షమే కాదు. పొత్తు భాజపాతో పెట్టుకున్నారు కాబట్టి వారి డిమాండ్లను కూడా ఆ పార్టీ వద్దే పరిష్కరించుకోవాలి. మా వద్ద కాదు."

-జేడీయూ సీనియర్ నేత

2015 ఎన్నికల్లో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్ ఆధ్వర్యంలో ఎల్​జేపీ 42 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడి కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం రామ్​ విలాస్ తనయుడు చిరాగ్ పాసవాన్.. పార్టీని నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గతంలో మాదిరిగానే సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇందుకు జేడీయూ వ్యతిరేకిస్తోంది.

లెక్కల రాజకీయం

అయితే 2015లో రాజకీయ పరిస్థితులు వేరు. ఆ ఎన్నికల్లో ఎన్​డీఏకు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్, ఆర్​జేడీ కూటమిలో జేడీయూ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఎల్​జేపీకి అన్ని స్థానాలు కేటాయించేందుకు జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2015 ఎన్నికల్లో రెండంటే రెండు సీట్లు గెలిచిన పార్టీకి అన్ని స్థానాలు కట్టబెట్టడానికి సిద్ధంగా లేమని చెబుతోంది. కేవలం పది స్థానాలను కేటాయించే యోచనలో ఉంది.

ఇదీ చదవండి:బిహార్​ సమరం: కాలం చెల్లిన కులం కార్డు!

ఎల్​జేపీ సైతం ఇదే తరహా లెక్కలు బయటపెడుతోంది. 2014 లోక్​సభ ఎన్నికల్లో జేడీయూ కేవలం రెండు సీట్లకే పరిమితమైందని, అయినప్పటికీ ఎన్​డీఏలో చేరిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో 17 సీట్లు కేటాయించినట్లు గుర్తు చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఇరుపక్షాలను ఒక్కతాటిపై ఉంచేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. పార్టీ అగ్ర నాయకత్వం నితీశ్ కుమార్​పై పూర్తిగా విశ్వాసం ఉంచింది. ఎన్​డీఏ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ప్రతిపాదించింది. ఈ నిర్ణయాల వల్ల ఎల్​జేపీను శాంతింపజేసేందుకు భాజపాకు దారులు మూసుకుపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు .

భాజపా X ఎల్​జేపీ!

బిహార్ ఎన్నికల్లో ఎల్​జేపీ గౌరవప్రదమైన సీట్లనే ఎన్​డీఏ నుంచి కోరుకుంటోందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనను భాజపా నేతలు ఖండిస్తున్నారు. ఎక్కువ సీట్ల కోసం దూకుడు వైఖరిని అవలంబించడాన్ని తప్పుబడుతున్నారు. 2015 సీట్ల పంపకం ఒప్పందంలో ఎల్​జేపీతో పాటు జీతన్ రామ్​ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహ పార్టీలను సైతం భాగస్వాములుగా కలుపుకున్నట్లు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత కఠిన వైఖరి అవలంబించేందుకు ఈ పార్టీలన్నీ ఎక్కువ స్థానాలు అభ్యర్థిస్తున్నాయని అన్నారు.

అయితే రామ్​ విలాస్ పాసవాన్ మాత్రం భాజపాకు సంపూర్ణ మద్దతుతో ఉన్నారు. కేంద్ర మంత్రిగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

విపక్షాల్లోనూ

ఆర్​జేడీ నేతృత్వంలోని ప్రతిపక్షంలోనూ లుకలుకలు నెలకొన్నాయి. తేజస్వీ యాదవ్​ను కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు సంకీర్ణ పక్షాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి:బిహార్ ఎన్నికల ముందు ఆర్జేడీకి షాక్‌

మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా(సెక్యులర్) అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ... జేడీయూ పార్టీకి దగ్గరవుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్​జేడీ నాయకత్వంపై అసంతృప్తితో మళ్లీ జేడీయూ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నాయి.

ప్రతిపక్ష శిబిరంలో ఉన్న రాష్ట్రీయ లోక్​ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ, వికాస్​ శీల్ ఇన్​సాన్ పార్టీ నేత ముఖేశ్ సహానీ సైతం ఆర్​జేడీ నాయకత్వంపై సంతుష్టిగా లేరని తెలుస్తోంది. వీరు కూడా బయటకు వెళ్తే విపక్ష శిబిరం నిట్టనిలువునా చీలిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎల్​జేపీ, కాంగ్రెస్ పొత్తు!

కాంగ్రెస్ కొత్త వాదనకు తెరతీసింది. ఇటీవల ఎల్​జేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు బిహార్ కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి చిరాగ్ పాసవాన్ సరైన వాడంటూ మాజీ ఎంపీ పప్పు యాదవ్ వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాంశంగా మారింది.

ఇలా... బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీల మధ్య ఏర్పడిన వైరుద్ధ్యాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. కాబట్టి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని కూటముల్లో సమూల మార్పులు సంభవించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి-కరోనా ఎఫెక్ట్​: డిజిటల్‌ వేదికపై ఎన్నికల ప్రచారం

Last Updated : Jul 13, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details