తెలంగాణ

telangana

బ్రిటన్​ ప్రధానికి మహిళ లేఖ.. దిల్లీ పోలీసులు పరుగోపరుగు

By

Published : Aug 29, 2020, 10:12 AM IST

Updated : Aug 29, 2020, 10:55 AM IST

దిల్లీకి చెందిన ఓ మహిళ.. తనకు సహాయం చేయమని ఏకంగా బ్రిటన్​ ప్రధానికే లేఖ రాసింది. లేకపోతే రెండు గంటల్లో ఆత్మహత్య చేసుకుంటానని డెడ్​లైన్​ పెట్టింది. దీంతో అప్రమత్తమైన బ్రిటన్​ అధికారులు.. భారత్​కు సమాచారన్ని చేరవేశారు. పోలీసులు ఆమెను పట్టుకునేందుకు అర్ధరాత్రి వేళ దిల్లీ వీధులను జల్లెడపట్టాల్సి వచ్చింది. తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Delhi woman writes to British PM threatening suicide, rescued by cops
బ్రిటన్​ ప్రధానికి దిల్లీ మహిళ 'ఆత్మహత్య' లేఖ

దిల్లీకి చెందిన ఓ మహిళ.. బ్రిటన్​, భారత్​ దేశాల అధికారులను పరుగులు పెట్టించింది. తనకు సహాయం చేయమని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ఏకంగా బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​కే ఈ-మెయిల్​ పంపించింది. చివరికి ఆమెను పట్టుకోవడానికి అర్ధరాత్రి వేళ దిల్లీ వీధులను అధికారులు జల్లెడ పట్టాల్సి వచ్చింది.

ఈ-మెయిల్​లో..

రోహిణి సెక్టర్​-21లో నివాసముంటున్న ఆ మహిళ ఈ నెల 26వ తేదీన.. తనకు సహాయం చేయమని బ్రిటన్​ ప్రధానిని వేడుకుంది. లేఖలో ఆమె పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే.. ఆ మహిళ మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతుంది. మరో రెండు గంటల్లో సహాయం అందకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

ఈ-మెయిల్​ చూసిన బ్రిటన్​ ప్రధాని కార్యాలయం షాక్​కు గురైంది. వెంటనే లండన్​లోని భారత రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. వివరాలు తెలుసుకున్న రాయబార కార్యాలయం.. భారత విదేశాంగశాఖ అధికారులను సంప్రదించింది.

పరుగులు పెట్టిన పోలీసులు..

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దిల్లీ అమన్​ విహార్​ పోలీస్​ స్టేషన్​ అధికారులు.. ఆ మహిళను ట్రేస్​ చేయడానికి పరుగులు తీశారు. ఆమె నివాసాన్ని కనుగొనేందుకు ఇన్​స్పెక్టర్​ సత్యపాల్​ సింగ్​, ఎస్​హెచ్​ఓ రఘువీర్​ సింగ్​, ఏసీపీ అతుల్​ వర్మ రంగంలోకి దిగారు.

అయితే.. ఫోన్​ కాల్స్​ను ఆ మహిళ ఎత్తకపోవడం వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటిగంటకు.. ఇంటింటికీ వెళ్లి జల్లెడపట్టడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న సెక్యురిటీ గార్డులను ప్రశ్నించారు. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అనంతరం చివరికి ఆ మహిళ ఉంటున్న అపార్ట్​మెంటును కనుక్కోగలిగారు పోలీసులు.

ఆ తర్వాత కుడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. తలుపు తెరిచేందుకు ఆ మహిళ నిరాకరించింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు పోలీసులు. వాళ్లు వచ్చి 10నిమిషాల్లో తలుపును బద్దలుకొట్టారు. అయినప్పటికీ.. వారందరినీ వెళ్లిపొమ్మని ఆ మహిళ పదేపదే అరిచింది.

లేఖ రాసిందిఅందుకే..

కౌన్సిలింగ్​ మొదలుపెట్టిన అనంతరం ఆమె ప్రవర్తనకు గల కారణాలు బయపడ్డాయి. వైవాహిక జీవితంలో సమస్యలు, ఆర్థిక సంక్షోభం వల్ల ఆ మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. తాను ఓ స్కూల్లో టీచర్​గా పనిచేసినట్టు.. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్టు ఆ మహిళ వెల్లడించింది. తన భర్త విడాకులిచ్చినట్టు పేర్కొంది. తీసుకున్న అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్నట్టు బాధపడింది. అందుకే బ్రిటన్​ ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపింది.

ఆమెను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందించాలని మెజిస్ట్రేట్​ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ చికిత్స కోసం ఇద్దరు సైకాలజిస్ట్​లు, ఓ వైద్యుడిని పిలిపించారు పోలీసులు.

ఇదీ చూడండి:-పోలీసులనే బెదిరించి అరెస్టు నుంచి తప్పించుకున్నాడు!

Last Updated : Aug 29, 2020, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details