దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడమే కాదు.. అవసరమైన వారికి సేవలు చేయడంలోనూ పోలీసులు ముందుంటున్నారు. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్న రక్షణసిబ్బంది.. లాక్డౌన్ వేళ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఔషధాలు అందించడం, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు చేయూత అందించడం సహా.. వివిధ రకాల సాయం చేయడంలో ముందుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దిల్లీలో జరిగింది. ఓ వృద్ధుడి 100వ పుట్టినరోజుకు ఏర్పాట్లు చేశారు.
వందో పుట్టినరోజు వేళ.. ఆ ఇంటికి అనుకోని అతిథులు! ఇదీ జరిగింది..
తన తండ్రి వందో పుట్టినరోజును జరుపుకోవాలని అనుకుంటున్నామని.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవటానికి అనుమతి పత్రం జారీ చేయాలని దిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది ఓ మహిళ. ఈ అంశం ఈశాన్య దిల్లీ డీసీపీ విజయాంత ఆర్య దృష్టికి వెళ్లింది. ఆ కుటుంబానికి సహాయం చేయమని పోలీసులను ఆదేశించారు డీసీపీ. ఈ నేపథ్యంలో పుట్టినరోజు ఏర్పాట్లకు సహకరించారు పోలీసులు.
పోలీసులే అతిథులుగా..
అనంతరం డీసీపీ విజయాంత ఆర్య సూచనల మేరకు ఎస్ఐ అమిత్కుమార్ బర్త్డే కేకుతో వారి ఇంటికి వెళ్లారు. పోలీస్ సిబ్బంది కేకుతో రావటంపై ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వందో పుట్టిన రోజు జరుపుకునేందుకు సహకరించిన డీసీపీకి వీడియో కాల్ చేసి కృతజ్ఞతలు తెలియజేశారు కుటుంబసభ్యులు.