తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకు: ఏకే - Delhi updates

దిల్లీలో సాఫీగా పాలన సాగించేందుకు ప్రధానమంత్రి ఆశీస్సులు కావాలని ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని వరుసగా మూడోసారి అధిష్ఠించిన కేజ్రీవాల్‌... ప్రచారంలో భాగంగా తమపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమిస్తున్నామన్నారు. దిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా 'ధన్యవాద్ దిల్లీ' పేరిట జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారవేదిక నుంచి కేంద్ర సహకారం కోరిన కేజ్రీవాల్.. దిల్లీ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

Delhi needs central support for all round development
దిల్లీకి అభివృద్ధికి మోదీ ఆశీస్సులు అవరసం: ఏకే

By

Published : Feb 16, 2020, 7:52 PM IST

Updated : Mar 1, 2020, 1:26 PM IST

దిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానం వేదికగా 'ధన్యవాద్ దిల్లీ' పేరిట జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ చేత.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర పాల్ గౌతమ్​లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మోదీ ఆశీస్సులు కావాలి...

ప్రమాణ స్వీకారం అనంతరం భారీసంఖ్యలో సభకు హాజరైన ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదన్నకేజ్రీవాల్...రాబోయే ఐదేళ్లలోనూ అదే తరహా పాలన అందిస్తామన్నారు. మీ బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడన్న ఏకే.. తన విజయాన్ని ప్రజావిజయంగా అభివర్ణించారు.

ప్రమాణ స్వీకార వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి స్నేహహస్తం అందించిన కేజ్రీవాల్.. దిల్లీ సంపూర్ణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. ప్రచారంలో తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమిస్తున్నామని, దిల్లీ అభివృద్ధికి ప్రధాని మోదీ ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు ఆప్​ అధినేత. దిల్లీ ప్రజలు దేశ రాజకీయాలను మార్చేశారని కితాబిచ్చారు.

బుల్లి మఫ్లర్​ మ్యాన్​...

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేజ్రీవాల్​లా దుస్తులు ధరించి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన 'బుల్లి మఫ్లర్ మ్యాన్' ఆవ్యన్ తోమర్.. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

భారీ జనసంద్రం మధ్య 'బుల్లి కేజ్రీవాల్​!'
బుల్లి మఫ్లర్​ మ్యాన్​తో స్వీయచిత్రం తీసుకుంటూ...
మరికొందరు బుల్లి మఫ్లర్​ మ్యాన్​ వేషధారణలో...

కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీకి చెందిన భాజపా ఎంపీలను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆహ్వానించింది. అయితే.. వారణాసి పర్యటన నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరుకాలేదు. ఈ కార్యక్రమానికి 2వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో పహారా కాశారు.

ఇదీ చదవండి:కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

Last Updated : Mar 1, 2020, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details