ఆ అమ్మాయి వయసు 18 ఏళ్లే. డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థినికి అరుదైన అవకాశం దక్కింది. భారత్లో బ్రిటన్ హై కమిషనర్గా ఒకరోజు పనిచేసేందుకు ఆహ్వానం అందింది. ఒక్కరోజు సమయంలోనే హై కమిషనర్గా తన సామర్థ్యాన్ని చూపి ప్రశంసలు అందుకున్న ఆ అమ్మాయి దిల్లీకి చెందిన చైతన్య వెంకటేశ్వరన్.
అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడంలో భాగంగా.. బ్రిటన్ హై కమిషనర్ కార్యాలయం ఆమెకు 'వన్డే హై కమిషనర్'గా అవకాశమిచ్చింది. దీని కోసం ఆ కార్యాలయం 'కొవిడ్ సంక్షోభ కాలంలో స్త్రీ-పురుష సమానత్వాన్ని సాధించడానికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి ఉన్న అవకాశాలు' అనే అంశంపై ఆన్లైన్లో మహిళలకు ఓ పోటీని నిర్వహించింది. అందులో 215 మంది పాల్గొనగా చైతన్య పంచుకున్న అభిప్రాయాలు అధికారులను మెప్పించగా ఈ అవకాశం తలుపు తట్టింది.