తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే - nirbhaya case convicts hanging date

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై మరోసారి స్టే విధించింది దిల్లీ కోర్టు. డెత్ వారెంట్లపై స్టే విధించాలంటూ దోషి పవన్​ గుప్తా దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఇప్పటి వరకు మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడింది.

delhi-court-stays-nirbhaya-convicts-death-sentence
నిర్భయ దోషుల ఉరిపై కోర్టు మరోసారి స్టే

By

Published : Mar 2, 2020, 6:21 PM IST

Updated : Mar 3, 2020, 4:40 AM IST

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై దిల్లీ పటియాల హౌస్​ కోర్టు మరోసారి స్టే విధించింది. క్షమాభిక్ష పెండింగ్​లో ఉన్నందున స్టే ఇవ్వాలని పవన్​ గుప్తా దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన అనంతరం ఈ ఆదేశాలిచ్చింది. ఇదే విధంగా గతంలో రెండుసార్లు( జనవరి 22, ఫిబ్రవరి 1) డెత్ వారెంట్లపై స్టే ఇచ్చింది కోర్టు. తాజాగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శిక్ష నిలిపివేయాలని న్యాయస్థానం సూచించింది.

క్షమాభిక్ష తిరస్కరణ..

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి పవన్‌ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. అదే విధంగా పవన్‌ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది.

కోర్టు ఆగ్రహం..

క్షమాభిక్ష అభ్యర్థన పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్‌.. దిల్లీ పటియాల హౌస్‌ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా.. కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యురేటివ్​, క్షమాభిక్ష పిటషన్లను ఆలస్యంగా దాఖల చేశారని మండిపడింది. 'మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నా'రంటూ దోషి తరఫు న్యాయవాదిని హెచ్చరించింది.

నిర్భయ దోషుల ఉరితీత అంశం ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం చేతిలో ఉందని, జడ్జికి ఇప్పుడు ఎలాంటి పాత్ర లేదని తిహార్​ జైలు అధికారులు వాదనల సమయంలో కోర్టుకు తెలియజేశారు.

వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది.

శతవిధాలా ప్రయత్నాలు..

ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రూపంలో శిక్ష అమలుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి ఉండగా.. దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషులు నలుగురు అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాలని అభ్యర్థించారు. దీనికి కోర్టు అంగీకరించడంతో ఉరి అమలు రెండోసారి వాయిదా పడింది.

ఆ తర్వాత దోషులకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల దిల్లీ కోర్టు మూడోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశించింది. ఉరి అమలు దగ్గరపడుతున్న సమయంలో దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మరోసారి కోర్టుకు వెళ్లాడు. తన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గించాలని కోరుతూ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే అతడి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. క్షమాభిక్ష అభ్యర్థన పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని మరోసారి కోర్టును కోరాడు పవన్​. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టే విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది దిల్లీ కోర్టు.

Last Updated : Mar 3, 2020, 4:40 AM IST

ABOUT THE AUTHOR

...view details