ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో భాగంగా 106 రోజులుగా కస్టడీలో ఉన్న కాంగ్రెస్ నేత పి చిదంబరానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. తాజాగా జైలు నుంచి విడుదలయ్యారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి. 106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వస్తున్న చిదంబరానికి మద్దతుగా తిహార్ జైలుకు భారీగా మద్దతుదారులు చేరుకున్నారు.
ఈడీ కేసులో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం చిదంబరానికి బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల రూపాయల బాండు, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని, సాక్షులతో సంప్రదింపులు జరపవద్దని ఆంక్షలు విధించింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడరాదని ఆజ్ఞాపించింది.
ఈడీ కేసులో దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ నవంబర్ 15న తీర్పునివ్వగా.. దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు చిదంబరం. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం.. నవంబర్ 28న తీర్పును వాయిదా వేసింది. ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కుటుంబ సభ్యుల హర్షం..
చిదంబరం విడుదలపై హర్షం వ్యక్తం చేశారు ఆయన భార్య నళినీ చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరం. 'చివరకు 106 రోజుల తర్వాత' అంటూ ట్వీట్ చేశారు కార్తీ.