తెలంగాణ

telangana

'పౌర' నిరసనలపై కేసులు.. భీమ్​ ఆర్మీ అధినేత అరెస్ట్​

By

Published : Dec 21, 2019, 2:50 PM IST

దేశ రాజధాని దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం చెలరేగిన హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టారు పోలీసులు. దిల్లీ దరియాగంజ్​ ఘటనలో భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​ను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు తాజాగా అరెస్టు​ చేశారు. మహారాష్ట్రలో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. 130 మందిపై కేసులు పెట్టారు. మధ్యప్రదేశ్​లో 35 మందిని అరెస్ట్ చేశారు.​ జబల్​పుర్​లో కర్ఫ్యూ విధించారు.

Daryaganj violence
'పౌర' నిరసనలపై కేసులు

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింసాత్మక ఘటనలపై చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ప్రజాఆస్తుల ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీ దరియాగంజ్​లో శుక్రవారం అల్లర్లకు సంబంధించి భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​ను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు తాజాగా అరెస్ట్​ చేశారు.

భీమ్​ ఆర్మీ ఆధ్వర్యంలో జామా మసీద్​ నుంచి జంతర్​ మంతర్​ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దరియాగంజ్​ అల్లర్లకు సంబంధించి చంద్రశేఖర్​ ఆజాద్​తో కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్ట్​ చేశారు.

మహారాష్ట్రలో 130 మందిపై కేసులు..

పౌర చట్టానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని మరాఠావాడ ప్రాంతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన 130 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 20 మందిని అరెస్ట్​ చేశారు. హింగోలి నగరం, కలమ్నూరి టౌన్​లో శుక్రవారం జరిగిన అల్లర్లలో పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు నిరనసకారులు. ప్రజాఆస్తుల ధ్వంసంపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.

మధ్యప్రదేశ్​లో 35 మంది అరెస్ట్​..

మధ్యప్రదేశ్​లో పౌర చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం అల్లర్లు చెలరేగిన ఘటనలో 35 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. నిన్న జరిగిన రాళ్లదాడిలో 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. జబల్​పుర్​ నగరంలోని గోహల్పుర్​, హనుమాంతల్​ పోలీస్​ స్టేషన్​ ప్రాంతం, కోత్వాలి, అధర్తా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు పోలీసులు. భోపాల్​లో ఆరు గంటల పాటు అంతర్జాల సేవలు నిలిపివేశారు.

ఇదీ చూడండి: 'హింసను సృష్టించకండి.. ఎవ్వరినీ వదలం'

ABOUT THE AUTHOR

...view details