తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 6:16 AM IST

ETV Bharat / bharat

ముంబయికి తప్పిన ముప్పు- ఊపిరి పీల్చుకున్న గుజరాత్

ముంబయికి తుపాను ముప్పు తప్పింది. అంచనా వేసిన స్థాయిలో విధ్వంసానికి పాల్పడకుండా తుపాను శాంతించింది. నగరానికి దూరంగా తీరం దాటింది. అయితే తుపాను ధాటికి పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గుజరాత్‌ రాష్ట్రంపైనా నిసర్గ పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదు.

nisarga
నిసర్గ

కరోనా ధాటికి కకావికలమవుతున్న ముంబయిపై 'నిసర్గ' తుపాను కరుణ చూపింది! భౌతిక ఎడం పాటిస్తూ మహానగరానికి దూరంగా తీరం దాటింది. అంచనా వేసిన స్థాయిలో విధ్వంసానికి పాల్పడకుండా శాంతించింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలను పెకిలించడంతో సరిపెట్టుకుంది. దీంతో ముంబయి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు, తుపాను తీవ్రతను ఎదుర్కొనేందుకుగాను మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలా సన్నద్ధమయ్యాయి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. సహాయక చర్యల కోసం బలగాలను మోహరించాయి.

విరిగి పడిన చెట్లు

అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన 'నిసర్గ' మహారాష్ట్రలోని అలీబాగ్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుపాను తీరం దాటే ప్రక్రియ మధ్యాహ్నం 2:30 గంటలకల్లా పూర్తయింది. నిసర్గ క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ముంబయి నుంచి అలీబాగ్‌ దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో దేశ ఆర్థిక రాజధాని పెను ముప్పును తప్పించుకున్నట్లయింది.

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

మహారాష్ట్రతోపాటు గుజరాత్‌పైనా నిసర్గ పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదు. అయితే- మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో గాలుల తీవ్రతకు ట్రాన్స్‌ఫార్మర్‌ మీద పడటంతో ఓ వ్యక్తి(58) మృత్యువాతపడ్డారు. రాయ్‌గఢ్‌, సింధ్‌దుర్గ్‌ జిల్లాల్లో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. భారీగా వర్షం కురిసింది. పుణె జిల్లాలో తుపాను సంబంధిత వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.

తుపాను సమయంలో సముద్రం ఉద్ధృతి

నిసర్గ ఉద్ధృతికి చెట్లు, ఇళ్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయే ముప్పుందని తొలుత భారత వాతావరణ విభాగం అంచనా వేసిన నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాయి. మహారాష్ట్రలో పలు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ముంబయిలో సముద్ర తీరానికి సమీపంలో నివసిస్తున్న దాదాపు 40 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబయికి రాకపోకలను రద్దు చేసిన విమానయాన సంస్థలు పెను ముప్పు తప్పడంతో సేవలను సాయంత్రం పునరుద్ధరించాయి. అయితే- 'నిసర్గ' ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌ పేర్కొన్నారు. పుణె, నాసిక్‌, అహ్మద్‌నగర్‌ అధికార యంత్రాంగాలు పరిస్థితులను సమీక్షిస్తున్నాయన్నారు.

63,700 మంది సురక్షిత ప్రాంతాలకు..

గుజరాత్‌లో తుపానుకు సంబంధించి దుర్ఘటనలేవీ చోటుచేసుకోలేదు. దక్షిణ గుజరాత్‌లో గాలులు సాధారణ వేగంతోనే వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అంతకుముందు, ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రంలో తీర ప్రాంతానికి చేరువలోని 8 జిల్లాల నుంచి 63,700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇదీ చదవండి:ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ వర్చువల్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details