తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజల అప్రమత్తతే అవినీతి అంతానికి బీజం.!

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వేళ్లూనుకుపోతోందనడానికి, నిత్యం ఏదో ఒక శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడుతుండటమే నిదర్శనం. రాజకీయ నాయకుల్లోనూ విపరీతమైన అవినీతి ప్రబలిపోయిందన్నది నిష్ఠురసత్యం.

By

Published : Nov 2, 2019, 9:10 AM IST

Updated : Nov 2, 2019, 7:19 PM IST

ప్రజావేగులే పాశుపతాలు

రాజకీయనాయకులు మాత్రం అధికారంలో ఉండేది అయిదేళ్లు మాత్రమే! కానీ ప్రభుత్వోద్యోగులు సుమారు 30 ఏళ్లపాటు సర్వీసులో కొనసాగే అవకాశం ఉంటుంది. అవినీతికి పాల్పడి చిక్కినా, సత్వర విచారణలు, తగిన శిక్షలు లేకపోవడంతో వారు మళ్ళీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుండటమే విషాదం.

ఈ పెడధోరణి వల్లే పాలన వ్యవస్థల్లో అవినీతి నలుమూలలా వ్యాపించిందని 1964లోనే సంతానం కమిటీ నివేదిక స్పష్టీకరించింది. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం పదిహేను పైసలు మాత్రమే పేదలకు చేరుతున్నాయని 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ వాపోయారు. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌- 2018’ నివేదిక ప్రకారం ప్రపంచంలో డెన్మార్క్‌, న్యూజిలాండ్‌, ఫిన్లాండ్‌, సింగపూర్‌, స్వీడన్‌ లాంటి దేశాలు అవినీతిరహితంగా అంతర్జాతీయ మన్ననలు అందుకుంటున్నాయి. భారత్‌లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. ప్రభుత్వ కార్యాలయాలు తీవ్రస్థాయిలో అవినీతిలో కూరుకుపోతున్నాయి.

అవినీతి సూచీలో 180 దేశాలతో పోటీపడి 78వ స్థానంలో నిలవడమే అందుకు దాఖలా. రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగుల అవినీతి అక్రమాలు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయన్నది సుస్పష్టం. అందువల్లే అవినీతి కేసుల్లో సత్వర విచారణలు జరిపి న్యాయస్థానాలు నిందితులకు కఠిన శిక్షలు వేయడం, ప్రభుత్వమూ శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించడం చాలా అవసరం. విచారణలో జాప్యం, శిక్షల విషయంలో తాత్సార ధోరణులు అవినీతిపరులు మరింత పేట్రేగిపోవడానికి దోహదం చేస్తున్నాయి.

తీవ్ర జాప్యమే శాపం

ప్రభుత్వరంగాల్లో జరిగే అవినీతి, అక్రమాలను అరికట్టడానికి 1964లో కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌) ఏర్పాటైంది. నిఘా వ్యవహారాలకు సంబంధించి దేశంలో అత్యున్నత సంస్థ ఇదే. దీని పరిధిలో స్వీకరించిన దర్యాప్తులన్నింటిలో సమగ్ర విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకుంటుంది. కఠినమైన శిక్షల కోసం న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తుంది. అయితే, ఆశించిన స్థాయిలో కాకపోయినా కమిషన్‌ ఏర్పాటు వల్ల కొంతమేర ఫలితాలు వస్తున్నాయి. అవినీతిపరులకు శిక్షలు పడటంలో తీవ్ర జాప్యమే ఆందోళనకరంగా ఉంది.

కేంద్ర నిఘా సంస్థ 2014-18 మధ్యకాలంలో అవినీతిపరులపై 1.97 లక్షల దరఖాస్తులు స్వీకరించింది. వాటిలో దర్యాప్తునకు ఉపయోగపడేవాటిలో 98 శాతం కేసులు పరిష్కారమయ్యాయి. అధికారులపై కొందరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ, సరైన సాక్ష్యాధారాలను అందించలేకపోతున్నారు. దీనివల్ల సుమారు 20 శాతం మేర దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. గత అయిదేళ్లలో సరైన ఆధారాలతో దర్యాప్తు చేసి 13,766 మంది అవినీతిపరులకు నిఘా సంస్థ శిక్షలు విధించింది. అందులో అత్యధికంగా 51.6 శాతం మందికి భారీ జరిమానాలు విధించింది. పలువురి నుంచి అవినీతి సొమ్మునూ తిరిగి వసూలు చేసింది. సుమారు 14.2 శాతం మందిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. దీనివల్ల వారికి సర్వీసుపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

కేంద్ర నిఘా సంస్థ వార్షిక నివేదిక (2018) ప్రకారం రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకులు, పౌరసరఫరా, గృహ నిర్మాణ తదితర సంస్థల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంటోంది. రైల్వేలో నిర్మాణ రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల మేర పనులు జరుగుతుంటాయి. వాటిని దక్కించుకోవడానికి గుత్తేదారులు పోటీపడుతుంటారు. ఎవరు తక్కువగా ‘కోట్‌’ చేస్తే వారికి పనులు దక్కే అవకాశం ఉంటుంది. ఆ నిబంధనలను అధికారులు గోప్యంగా ఉంచాలి. పలువురు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. గుత్తేదారులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారు.
దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. బ్యాంకింగ్‌ రంగంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ వేల కోట్ల రూపాయల రుణాలు లబ్ధిదారులకు అప్పనంగా చెల్లిస్తున్నారు. ఈ లావాదేవీల్లో బ్యాంకు అధికారులకు రావాల్సిన వాటా అడ్డదారిలో ముడుతుందనే విషయం బహిరంగ రహస్యమే! అవినీతి, అక్రమాల కేసుల్లో నిరుడు కెనరా బ్యాంకులో 83 మంది, భారతీయ స్టేట్‌ బ్యాంకులో 72 మంది, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 63 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. ప్రస్తుతం వారంతా జైలుశిక్షలు అనుభవిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో తహసీల్దార్లు, వీఆర్‌ఓలు, పుర, నగర పాలక, పట్టణ ప్రణాళిక, వైద్యబీమా సహా పలు శాఖల అధికారులెందరో అనిశా దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. వాస్తవానికి అవినీతి అక్రమాలు ఎక్కడికక్కడ వేళ్లూనుకున్నా, తెరమీదకు వచ్చేవి కొన్ని మాత్రమే! రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల అండదండలు లభిస్తుండటంతో అవినీతికి పాల్పడే సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి సామాన్యులు వెనకాడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పెద్దస్థాయి అధికారి వరకు ఎవరి వాటా వారికి ముడుతుండటంతో అవినీతి చాపకింద నీరులానే ఉండిపోతోంది.

జాతీయ నేర విభాగం ఇటీవల 2017నాటి నివేదికను విడుదల చేసింది. ఆ గణాంకాల ప్రకారం 2015-17 మధ్య కాలంలో అవినీతికి సంబంధించి 13,751 కేసులు నమోదయ్యాయి. వాటిలో 23.46 శాతం కేసులతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్‌ 9.7 శాతం, ఒడిశా 8.7 శాతం కేసులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 337, ఆంధ్రప్రదేశ్‌లో 548 కేసులు నమోదయ్యాయి. 2017లో 4,716 మంది నిందితులను అరెస్టు చేయగా, కేవలం నాలుగు శాతానికే శాఖపరమైన చర్యలను వర్తింపజేయడం ఆశ్చర్యం కలిగించే అంశం.

సరైన సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్టు చేసినప్పటికీ, విచారణ సమయానికి చాలా కేసులు ఎందుకు వీగిపోతున్నాయో అంతుచిక్కని విషయం. ఇలాంటి సందర్భాల్లో విచారణ అధికారులను బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలున్నాయి. లేదా వారిని మచ్చిక చేసుకోవడమూ ఒక మార్గంగా భావిస్తున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లో ఇద్దరు పోలీసు అధికారులు నిందితులను విడిపించేందుకు లక్షా యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడిన ఉదంతమే ఇందుకు నిదర్శనం.

అధికారులు అక్రమార్కుల కొమ్ముకాయడం ద్వారా ప్రభుత్వ శాఖలపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. కేంద్ర నిఘా సంస్థ గత ఏడాదిలో అవినీతి అధికారుల నుంచి రూ.97.53 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసింది. అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న 1,529 మంది ఉద్యోగులను దిగువస్థాయి ఉద్యోగాలకు బదిలీ చేశారు. సుమారు 1,868 మందికి వేతన పెంపుదల నిలుపుచేశారు. ఇప్పటికీ 22,819 కేసులను విచారణ పేరిట సాగదీస్తున్నారు.
వ్యవస్థల బలోపేతమే కీలకం

గ్రామసభల ద్వారా ప్రజానీకాన్ని అవినీతిపై అప్రమత్తం చేసి ఫిర్యాదులు చేసే విధంగా ప్రోత్సహించాలి. యువత సైతం ముందుకు వచ్చి బాధ్యతగా అవినీతిపై పోరాడాల్సిన తరుణమిది. ప్రభుత్వరంగ సంస్థల్లో అన్ని లావాదేవీలనూ ‘ఆన్‌లైన్‌’ విధానంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడే అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తీసివేసే చట్టం తీసుకురావాల్సిన సమయమిది. పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి, నిందితులకు వేగంగా శిక్షలు ఖరారు చేయాలి.

కేంద్ర నిఘా సంస్థలో 23.27 శాతం, సీబీఐలో 18 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేస్తే కేసుల దర్యాప్తు వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుడు సుమారు 70.5 లక్షల మంది పౌరులు, 94 వేల సంస్థలు తమ బాధ్యతగా అవినీతిని నిర్మూలించేందుకు ప్రతినబూనడం విశేషం. మొత్తం దేశజనాభాలో వీరి సంఖ్య చాలా తక్కువ. యువతరం మేల్కొని అవినీతి వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలి. ప్రజావేగులుగా మారాలి. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి

సమాచార హక్కు చట్టం వంటివాటి గురించి విస్తృత ప్రచారం కొనసాగించాలి. ప్రజల అప్రమత్తతే అవినీతి అంతానికి తొలి బీజం. అక్రమాలను ప్రశ్నించడంతోపాటు వ్యవస్థల వివరాలు తెలుసుకోవాలి. ప్రజల తోడ్పాటే నిఘా సంస్థలు, వ్యవస్థలకు అవినీతి వ్యతిరేక పోరులో ఎంతగానో అక్కరకు వస్తుంది. ఈ తరహా ప్రజా చైతన్యం వెల్లివిరిస్తే సమాజంలో అవినీతి అంతానికి సరైన దిశగా బాటలు పడతాయి!

- డాక్టర్​ సిలువేరు హరినాథ్​(రచయిత-'సెస్​'లో రీసెర్చ్​ అసిస్టెంట్​)

Last Updated : Nov 2, 2019, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details