జమ్ము కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థాయికి తెచ్చేందుకు చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను పరిశీలించేందుకే విదేశీ ప్రతినిధుల బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. 'గైడెడ్ టూర్' అంటూ విపక్షాలు చేసిన విమర్శలను తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన, అసత్య ప్రచారాలని తిప్పికొట్టారు. ఐరోపా ప్రతినిధులతో కలిసి భవిష్యత్తులో కశ్మీర్ పర్యటన నిర్వహిస్తామని వెల్లడించారు.
"కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం సహా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో నెలకొన్న సాధారణ పరిస్థితులను గమనించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం."
-రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి
పర్యటనలో భాగంగా ప్రతినిధులు కశ్మీర్లోని పౌరులు, రాజకీయ నాయకులు, భద్రత అధికారులతో పాటు మీడియాను కలిసినట్లు రవీశ్ వెల్లడించారు. భద్రత పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ పర్యటన ఖరారు చేసినట్లు తెలిపారు.