వృద్ధురాలి ప్రాణం తీసిన పాడి ఆవు! ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలోని రాజాజీపురంలో ఓ గోవు వృద్ధురాలిపై దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దారితప్పి వీధుల్లో సంచరిస్తున్న ఈ సాధు జంతువుకు ఏమైందో కానీ ఒక్కసారిగా క్రూర మృగంలా ప్రవర్తించింది. 70 ఏళ్ల విమలాదేవి తన రెండున్నరేళ్ల మనుమడితో ఇంటిబయట నడుస్తుండగా.. వెనుకనుంచి ఆవు ఆమెను తోసింది. కిందపడిపోయిన ఆమెను ఇష్టం వచ్చినట్టుగా తొక్కింది. పక్కనే ఉన్న బాలుడ్ని తలతో దూరంగా నెట్టేసిందా ఆవు. అరుపులు విని బయటకు వచ్చిన కొందరు ఆ గోవును తరిమినా... వృద్ధురాలి ప్రాణాలు కాపాడలేకపోయారు. చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దారి తప్పి వచ్చిన పశువులు ఇలా ప్రవర్తించడం స్థానికులను కలవరపెడుతోంది. వీటిని వీధుల్లోంచి తొలగించాలని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. నియంత్రణ లేకనే ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.