కరోనా విజృంభణ నేపథ్యంలో బిహార్ శాసనసభ ఎన్నికల నిర్వహణను అతి పెద్ద సవాలుగా అభివర్ణించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా. ఇటీవల రాజ్యసభ ఎన్నికలును ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించినా... బిహార్ ఎన్నికల్లో పరిస్థితి విభిన్నంగా ఉంటుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో మార్పులు, పోలింగ్ సమయంలో తీసుకునే జాగ్రత్తలు, డిజిటల్ ప్రచారాల విషయంలో ఎన్నికల నియమావళి వర్తింపు వంటి పలు అంశాలపై ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు అరోడా.
ప్ర: కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా ఈ ఏడాది జూన్లో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
జ: భారత ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలను అద్భుతంగా నిర్వహించింది. జూన్ 19న 8 రాష్ట్రాల్లో 19 స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సమయంలో కొవిడ్-19 నియంత్రణ చర్యలు తీసుకున్నాం. ప్రతి రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన నోడల్ ఆఫీసర్ను నియమించింది ఈసీ. వాళ్లే కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు.
పోలింగ్ రోజు దాదాపు 1000 మంది ఓటేయగా.. ఒక్క మధ్యప్రేదేశ్లో మాత్రమే ఒక పాజిటివ్ కేసు వచ్చింది. అందరూ ఓట్లు వేశాక ఆ వ్యక్తికి ఓటింగ్కు అనుమతి ఇచ్చాం. రాజస్థాన్లో ఓ ఎన్నికల అధికారికి కరోనా వచ్చింది. ఈ రెండు ఘటనలు మినహా ఎన్నికలప్పుడు ఎవరూ ఆసుపత్రి పాలవలేదు. అంతా సవ్యంగానే జరిగింది. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం.
ప్ర: దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బిహార్ ఎన్నికలు, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు నిర్వహిస్తారా? ఒకవేళ ఎన్నికలు జరిగితే ఓటర్లు, పోలింగ్ సిబ్బంది రక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
జ: సకాలంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది భారత ఎన్నికల సంఘం. బిహార్ రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా స్థాయి అధికారులతోనూ ఈ విషయంపై సమాలోచనలు జరుగుతున్నాయి. సాధ్యాసాధ్యాలు, కరోనా పరిస్థితులను పరిశీలించి ఎన్నికల షెడ్యూల్ తయారు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం.
శానిటైజేషన్, భౌతిక దూరం నిబంధనలు పాటించడాన్ని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తాం. వాటిని పక్కాగా అమలు చేసేందుకు, పర్యవేక్షణకు బృందాలను ఏర్పాటు చేయనున్నాం. రాజకీయ పార్టీ నాయకులు తమ ప్రచార సమయాల్లోనూ ఈ నిబంధనలు ఉల్లంఘించడానికి వీలు లేకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేస్తాం.
ఎన్నికల యంత్రాలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఇతర భాగస్వామ్యపక్షాల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఈసీ రూపొందిస్తోంది. ఎన్నికల వివిధ దశలలోని విధివిధానాల పర్యవేక్షణకు కమిషన్లోని అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. కరోనా గురించి డిజిటల్, సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తాం. సంక్షిప్త సందేశాలు పంపడం, ఓటర్లను మార్గనిర్దేశం చేస్తాం.
ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ గరిష్ఠంగా 1000 మందికే అనుమతి ఇవ్వనున్నాం. ఇప్పటివరకు 1500 వందలుగా ఉన్న పరిమితిని తగ్గిస్తున్నాం. ఫలితంగా పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. ఒక్క బిహార్లోనే 33,797 అదనపు పీఎస్లను ఏర్పాటు చేయనున్నాం.
వృద్ధులు(65 సంవత్సరాలు పైబడిన వాళ్లు), వికలాంగులు, హోమ్ క్వారంటైన్లో ఉన్న కొవిడ్ పాజిటివ్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లను అందిస్తాం. ఫలితంగా వారికి కరోనా ముప్పు తగ్గుతుంది.